దిల్లీలో బీజేపీ నేత జితేందర్‌ రెడ్డి ఇంటి వద్ద జరిగింది కిడ్నాప్ కాదని తెలంగాణ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రను చేధించడంలో భాగంగా అరెస్ట్ లు జరిగినట్లు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.


తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ హత్య కు 15కోట్ల రూపాయిల సుపారీ డీల్ కుదుర్చున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు సైబరాబాద్ పోలీసులు. మంత్రి హత్యకు జరిగిన కుట్రను  చేధించినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రాధమికంగా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.ఈ కేసులో బిజెపి నేతలు జితేందర్ రెడ్డి, డికే అరుణ అనుచరుల పాత్రపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు సిపి స్టిఫెన్ రవీంద్ర.


వివరాల్లోకి వెళితే గత నెల 25వ తేదిన పేట్ బషీర్ బాద్ పిఎస్ పరిధిలోని సుచిత్ర వద్ద హైదర్ ఆలీ , ఫారుఖ్ పై నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్ లు మారణాయుధాలతో దాడికి ప్రయత్నించడంతో తప్పించుకుని పారిపోయిన హైదర్ ఆలీ, ఫారుఖ్ లు అదే రోజు సాయంత్రం పేట్ బషీర్ బాద్ పోలీసులకు ఫిర్యాదు చేసారు . కేసు నమోదు చేసిన పోలీసులు గత నెల 27వ తేదిన యాదయ్య,నాగరాజు,విశ్వనాధ్ లను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.నిందితులను విచారిస్తున్న క్రమంలో మహబూబ్ నగర్ కు చెందిన రఘవేంద్రరాజు,మధుసూదన్ రాజు,అమరేందర్ రాజు మరికొందరితో కలసి తెలంగణా ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రపన్నిట్లు తెలిసింది. మంత్రి హత్య చేసినా , లేదా చేయించినా 15కోట్లు ఇస్తానంటూ మధుసూదన్ రాజు అనే వ్యక్తి నాగరాజుకు చెప్పడంతో నాగరాజు ఆ పనిని నవంబర్ 18వ తేదిన ఫరుఖ్ కు అప్పగించడంతో ఫరుఖ్ ఇదే విషయాన్ని తన స్నేహితుడు హైదర్ ఆలీకి చెప్పాడు.రహస్యంగా ఉంచాల్సిన విషయం ఆలీకి చెప్పాడంతో విషయం తెలసుకున్న నాగరాజు ,యాదయ్య, విశ్వనాధ్ లు కలసి ఆలీ,ఫరుఖ్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు సిపి తెలిపారు.అలా ఫరుఖ్ ఫిర్యాదుతో మంత్రి హత్య కుట్ర వెలుగుచూసిందన్నారు. ఈ కేసులో నాగరాజు,విశ్వనాధ్, యాదయ్య,అమరేంద్రరాజు, రాఘవేంద్రరాజు,మధుసూధన్ రాజు,మున్నూర్ రవి,థఫాను అరెస్ చేసినట్లు సిపి తెలిపారు.నిందితులను పూర్తి స్దాయిలో విచారించి మంత్రి ఎప్పుడు ,ఎలా హతమార్చాలని పథకం రచించారో,ఇందులో ఎంత మంది ప్రమేయం ఉందో బయటపెడతామంటున్నారు సైబరాబాద్ పోలీసులు.


ఈ వ్యవహారం పై స్పందించిన మాజీ మంత్రి ,బిజెపి నేత డికే అరుణ మాట్లడుతూ పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని . నిజాలేంటో బయటపెట్టండంటూ డిమాండ్ చేసారు .శ్రీనివాస్ గౌడ్ పై మాకు కక్ష ఎందుకుంటుందంటూ పోలీసుల తీరును తప్పుబట్టారు డికే అరుణ.