తెలంగాణ ప్రభుత్వం ఇటీవల దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రదర్శించిన డ్రోన్ షో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తరహాలోనే వీక్షకులను మరింత ఆకట్టుకోవడానికి మరో డ్రోన్ షో కి ప్రభుత్వం ప్లాన్ చేసింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మంగళవారం (జూన్ 20) అంబేడ్కర్ విగ్రహం వద్ద హోం మంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్, ఆర్ అండ్ బీ కార్యదర్శి శ్రీనివాసరాజుతో కలిసి ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. 


ముగింపు రోజున ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ట్యాంక్‌ బండ్‌పై 750 డ్రోన్‌లతో భారీ డ్రోన్‌ షో నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని చెప్పారు. ఈ సందర్భంగా గడిచిన 9 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే విధంగా డ్రోన్ షో ఉంటుందని చెప్పారు. ఆ రోజు సాయంత్రం ట్యాంక్ బండ్ పై రాకపోకలు నిలిపివేస్తున్నామని మంత్రి తలసాని వివరించారు. 


ఈ సందర్భంగా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ 22 వ తేదీన హైదరాబాద్ లోని అన్ని నియోజకవర్గాల నుంచి అంబేడ్కర్ విగ్రహం దగ్గరికి బైక్‌ ర్యాలీ చేరుకునేలా ప్రణాళిక వేశామని చెప్పారు. ఆ తర్వాత కళాకారులు నృత్యాలు, దరువులు, వివిధ వేష ధారణలతో అమరవీరుల స్మారక కేంద్రం వరకు ర్యాలీ చేరుకుంటుందని అన్నారు. అనంతరం స్మారక కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి సభలో ప్రసంగిస్తారని తెలిపారు. మంత్రి వెంట హైదరాబాద్ కలెక్టర్ అమోయ్ కుమార్, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, పలువురు డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.