తెలంగాణలో ప్రజారోగ్య శాఖలో ప్రక్షాళ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. దీని కోసం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. సూచించిన అంశాలపై ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రక్షాళన ప్రారంభించారు. 


తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వైద్యసిబ్బంది కొరత వేధిస్తోంది. అదే టైంలో వేరే ప్రాంతాల్లో సిబ్బంది ఉన్నప్పటికీ అక్కడ అనుకున్నంత మంది రోగులు రావడం లేదనే విమర్శులు ఉన్నాయి. అందుకే ఈ రెండింటిని బేరీజు వేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వనరులను హేతుబద్దీకరించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.


అధికంగా ఉన్న ప్రాంతాల్లోని సిబ్బందిని వేరే ప్రదేశాలకు బదిలీ చేస్తారు. అసలు ఉపయోగంలో లేని సెంటర్‌లను మూసివేసి అక్కడ సిబ్బందిని కూడా అవసరమైన చోటుకు బదిలీ చేస్తారు. ఇలా చేయడం వల్ల ప్రజలకు సత్వర సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.


దీనిపై ఇప్పటికే జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు వెళ్లిపోయాయి. ఈ మేరకు అవసరం లేని సెంటర్‌లను గుర్తించే పనిలో ప్రభుత్వ యంత్రాగం ఉన్నట్టు తెలుస్తోంది. మూడు నెలల్లోనే ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో ఉన్న ప్రభుత్వం టీబీ సెంటర్‌ను డీఎంఈ పరిధిలోకి మార్చింది ప్రభుత్వం. ప్రజలకు మెరగైన సేవలు అందించడానికి డీపీహెచ్‌ విభాగాన్ని బలోపేతం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. 


ఇప్పటి వరకు హైదరాబాద్, సికింద్రాబాద్‌లో మాత్రమే డీఎంహెచ్‌వో ఆఫీస్‌లు ఉండేవని వీటని ఐదు ప్రాంతాలకు విస్తరించబోతున్నారు. కొత్తగా చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌లో కూడా డీఎంహెచ్‌వో ఆఫీస్‌లు పెట్టబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కొత్తవాటితో కలుపుకుంటే రాష్ట్రవ్యాప్తంగా డీఎంహెచ్‌వో సెంటర్‌ల సంఖ్య 38 కాబోతోంది. 
ప్రస్తతం రాష్ట్రంలో ఉన్న 636 పీహెచ్‌సీలను మరికొన్ని మండలాలకు విస్తరించారు. వీటితోపాటు 0 పీహెచ్‌సీలను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లుగా మార్చారు. వాటి పర్యవేక్షణనను వైద్య విధాన పరిషత్‌కు మార్చారు. మరికొన్ని మండలాల్లో పీహెచ్‌సీలు ఏర్పాటు అవసరం ఉందని గ్రహించిన ప్రభుత్వం వాటి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. వీటితోపాటు అన్ని పీహెచ్‌సీలో ఒకే రూల్స్ ఉండేలా కూడా చేస్తున్నారు.