Telangana Formation Day: తెలంగాణ ప్రజల బాధను అర్థం చేసుకున్న సోనియా గాంధీకి లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మాజీ స్పీకర్ మీరా కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మీరా కుమార్.. 'నాకు తెలుగులో మాట్లాడాలని ఉంది. తెలుగు భాష చాలా అందంగా ఉంటుంది. మా నాన్న ఇక్కడికి వచ్చే వారు. అప్పటి నుంచే నాకు తెలుగుతో మంచి అనుబంధం ఏర్పడింది. తెలంగాణ ప్రజల బాధను అర్థం చేసుకున్న సోనియా గాంధీకి ధన్యవాదాలు. తెలంగాణ ప్రజలను అందరూ మోసం చేశారు. తెలంగాణ ప్రజల సమస్యలను ఎవరూ వినలేదు, పట్టించుకోలేదు. సోనియా మాత్రం తెలంగాణ ప్రజలను అర్థం చేసుకున్నారు. విప్లవకారులు కూర్చున్నందుకు ఈ వేదిక వెలిగిపోతోంది. తెలంగాణ ప్రజల బాధలు చూసి రాష్ట్రం ఏర్పాటు చేశాం. రాజ్యాంగ పరిధిలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పాటు జరిగింది అనడం పూర్తిగా హాస్యాస్పద'మని లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అన్నారు. 


'9 ఏళ్లు గడిచాయి, రాష్ట్ర పరిస్థితులు మాత్రం మారలేదు'


తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు గడిచినందుకు సంతోషంగా ఉందన్న మీరా కుమార్.. ఈ 9 సంవత్సరాల్లో తెలంగాణలో పరిస్థితులు మారనందుకు దుఃఖంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు అలాగే ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ నుంచి కాస్త పక్కకి వెళ్లి చూస్తే తెలంగాణలో ఉన్న పరిస్థితులు తెలుస్తాయని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులు చూసి సోనియా, రాహుల్ బాధ పడుతున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణ బాధలు మార్చడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకోస్తామని అన్నారు. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా పేర్కొన్నారు. ఎప్పుడు పిలిచినా ఒక్క కాల్ చేయగానే తెలంగాణకి వస్తానని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ రాష్ట్ర నాయకత్వానికి సూచించారు.


తెలంగాణ బోనం ఎత్తుకున్న మీరా కుమార్


గాంధీ భవన్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి మీరా కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె బోనం ఎత్తుకున్నారు. వేదికపై మీరా కుమార్ జై తెలంగాణ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ సెక్రటరీలు నదీమ్ జావిద్, రోహిత్ చౌదరి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎంపీ వీహెచ్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.