YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరిపారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొని... జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల ఫొటోలకు పూలమాలలు వేశారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం వైఎస్ షర్మిల  మాట్లాడుతూ... నీళ్లు, నిధులు, నియామకాల కోసం మూడు కోట్ల మంది ఏకమై.. కొట్లాడితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని తెలిపారు. అమర వీరుల త్యాగ ఫలితం, సబ్బండ వర్గాల పోరాట ఫలితమే "తెలంగాణ" అని చెప్పుకొచ్చారు. ప్రత్యేక రాష్ట్రంలోనూ ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలు కనుమరుగవుతున్నాయని అన్నారు. దొరల పాలన మళ్లీ వచ్చిన వేళ, ప్రతిపక్షాలు అమ్ముడుపోయిన సమయంలో పుట్టిందే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని ఆమె వివరించారు. నియామకాల కోసం మొట్టమొదటి సారిగా పోరాటం చేసింది తామేనని అన్నారు. అన్నం మెతుకులు ముట్టకుండా పోరాటం చేసి.. గెలిచి, నిలిచామన్నారు. నిరుద్యోగ దీక్షలతో సర్కారు మెడలు వంచి నోటిఫికేషన్లు ఇప్పించిందని చెప్పారు. కాంట్రాక్టు కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన నిలబడింది కూడా తామేనని పేర్కొన్నారు. 






నిస్వార్థంగా ఉద్యమించి 3800 కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టాం


నిధులు పక్కదారి పడుతుంటే, తెలంగాణ సంపద కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయితే ప్రశ్నించే గొంతుకగా నిలిచింది కూడా తామేనని వైఎస్ షర్మిల వెల్లడించారు. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేస్తే.. ఎదురు నిలిచి, ప్రశ్నించింది కూడా తానేనని వివరించారు. అక్రమ అరెస్టులతో, పోలీసు లాఠీలతో, అక్రమ నిర్బంధాలతో హింసించినా..  మొక్కవోని దీక్షతో పోరాటం చేశామన్నారు. నీటి వాటాల్లో అన్యాయం జరిగితే, కాళేశ్వరంతో వేల కోట్లు దోచుకుంటే.. నిస్వార్థంగా ఉద్యమించి 3800 కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టామని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఇచ్చిన మోసపూరిత వాగ్ధానాలను ఎండగట్టింది తామేనన్నారు. రుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఇండ్లు, పోడు పట్టాలు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, మూడెకరాల భూమి, వడ్డీ లేని రుణాలు, కేజీ టు పీజీ ఉచిత విద్యపై గొంతెత్తి ప్రశ్నించింది కూడా తమ పార్టీనే అని షర్మిల స్పష్టం చేశారు.






ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలంటే మళ్లీ మరో ఉద్యమం జరగాలని.. సర్కారు మారితేనే బతుకులు మారుతాయని చెప్పారు. మళ్లీ వ్యవసాయం పండుగ కావాలన్నా, సొంతింటి కల నెరవేరాలన్నా, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు కావాలన్నా YSR సంక్షేమ పాలన రావాలన్నారు. జలయజ్ఞం ద్వారా జలసిరులు కురవాలని, అర్హులకు పోడు పట్టాలు అందాలని, పేదలకు భూములు దక్కాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దళిత, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగాలని,  ప్రజలు అభివృద్ధి బాట పట్టాలని, సబ్బండ వర్గాలకు సంక్షేమం చేరాలని... ఇందుకోసం వైయస్ఆర్ బిడ్డ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని వైఎస్ షర్మిల వివరించారు.