V Vijayasai Reddy: ఏపీకి చెందిన వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై హైదరాబాద్‌లో ఫిర్యాదు నమోదైంది. టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత, ఖైరతాబాద్ కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే విజయ రెడ్డి.. విజయసాయి రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై రాజ్యసభలో విజయసాయి రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు దారులు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెల్లలో కూలిపోతుందంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. రాజ్యసభలో ఆన్ రికార్డ్ లో విజయసాయి రెడ్డి మాట్లాడిన విషయాలపై కంప్లైంట్ ఇచ్చారు.


ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత మాట్లాడుతూ.. బీఅర్ఎస్, వైసీపీ కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని అన్నారు. ఏపీలో జరిగే ఎన్నికలకు బీఅర్ఎస్ ఫండింగ్ ఇస్తుందని.. ఇద్దరి మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని అన్నారు. తెలంగాణలో సుస్థిర పాలన ఉందని.. ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విజయసాయి రెడ్డి లాంటి నాయకుల వ్యాఖ్యలు చెల్లుబాటు కావని అన్నారు. విజయసాయి రెడ్డి వాఖ్యలపై సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాజ్యసభ ఛైర్మన్ ధన్‌కడ్.. ఎంపీ విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.