Revanth Reddy: హర్యానా, పంజాబ్‌లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేసి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో వివిధ అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన రేవంత్ రెడ్డి... క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చేపట్టే చర్యలను వివరించారు. హర్యానా, పంజాబ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు చేపట్టే మంచి చర్యలపై కచ్చితంగా అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు. 


ఆ ఇద్దరికీ గ్రూప్‌ 1 ఉద్యోగాలు


రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఈసారి బడ్జెట్‌లో క్రీడలకు భారీగా కేటాయింపులు చేశామన్నారు రేవంత్‌రెడ్డి. గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడలను ప్రోత్సహించాలని రూ.321 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలియజేశారు. చదువులోనే కాదు క్రీడల్లోరాణిస్తే ఉన్నత ఉద్యోగం వస్తుందని కుటుంబ గౌరవం పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. దీన్ని రుజువుచేసేందుకే నిఖత్ జరీన్, సిరాజ్‌కు గ్రూప్1 ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు. 


కష్టమైనా ఉన్నత ఉద్యోగాలు 


ఈ ఇద్దరు క్రీడాకారులనకు ఆ హోదా ఉద్యోగాలు ఇచ్చేందుకు రూల్స్ అడ్డొచ్చినా కొన్ని సవరణలు చేసి మరీ వారిని ప్రోత్సహించామన్నారు రేవంత్. వీళ్లను ఆదర్శంగా తీసుకొని మరికొందరు క్రీడాకారులు దేశం తరఫున ఆడాలని ఆకాంక్షించారు. చదువుకుంటేనే ఉన్నత ఉద్యోగాలు వస్తాయనే భ్రమల నుంచి తల్లిదండ్రులను తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఏ స్థాయి క్రీడల్లో ఏ మెడల్ , ట్రోఫీలు సాధించిన వారికి ఎలాంటి ప్రోత్సహకాలు ఇవ్వాలనేది అధ్యయనం చేస్తామని తెలిపారు. వారి ప్రతిభను బట్టి వారికి భూమి, ఉద్యోగం, నగదు ప్రోత్సాహకాలు ప్రభుత్వం తరుఫున ఇస్తామని మాట ఇచ్చారు. 


బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ


తెలంగాణ రాష్ట్రంలో కొత్త స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు రేవంత్‌రెడ్డి. వివిధ రాష్ట్రాల పాలసీలు అధ్యయనం చేసి బెస్ట్ పాలసీని తెస్తామన్నారు. అత్యధికంగా హర్యానాలో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో స్పోర్ట్స్ పాలసీని సభలో ప్రవేశపెడతామన్నారు. మండల కేంద్రాల్లో భూములు అందుబాటులో ఉంటే స్టేడియం నిర్మించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. 


కొత్తగా నిర్మితమవుతున్న బ్యాగరికంచెలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు బీసీసీఐతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని సభకు వివరించారు రేవంత్ రెడ్డి. బీసీసీఐ వాళ్లు కూడా సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు. రాబోయే కొద్దిరోజుల్లోనే ఇందుకు భూమిని కేటాయిస్తామన్నారు. 


స్పోర్ట్స్ విషయంలో నిధుల కేటాయింపుతోపాటు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళతామన్నారు రేవంత్ రెడ్డి. స్పోర్ట్స్ పాలసీ కోసం ఎవరు ఏ సలహాలు ఇచ్చినా స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో గతంలో నిర్మించిన స్టేడియాలు ప్రైవేట్, రాజకీయ కార్యక్రమాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. వీటన్నింటినీ అప్ గ్రేడ్ చేసి విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలనుకుంటుందని... దీనికి సభలో ఉన్న అన్ని పార్టీల మద్దతు అవసరం అని విజ్ఞప్తి చేశారు. 


సలహాలు ఇస్తాం; కేటీఅర్


ప్రభుత్వం తీసుకొస్తామన్న స్పోర్ట్స్ పాలసీ కోసం తమ సలహాలు సూచలు కచ్చితంగా ఇస్తామన్నారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్. తెలంగాణలోని ప్రతి గ్రామంలో తమ  ప్రభుత్వం గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. వాటిని కాస్త రిపేర్ చేసి వాడుకుంటే బాగుంటుందని సూచన చేశారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాలను బాగు చేసి వాటిని కూడా మెయింటెన్ చేయాలని సలహా ఇచ్చారు.