కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project)ను 80వేల కోట్లతో కట్టామనడం అబద్దన్నారు ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy ). తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబ సభ్యులు (Kcr Family) తప్పా, ఎవరు సాగునీటి పారుదల శాఖకు మంత్రులుగా పని చేయలేదన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణమే 97,448 కోట్లు మంజూరైందన్నారు. ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం అడ్డుగోలుగా అప్పులు తెచ్చింది కాకుండా...ప్రభుత్వాన్ని దబాయిస్తున్నారని అన్నారు.


సభను తప్పుదోవ పట్టిస్తున్నారు


అవాస్తవాలతో హరీశ్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. సభను తప్పు దోవ పట్టించే విధంగా సభ్యులు ఎవరైనా మాట్లాడినా, సమాచారం ప్రవేశపెట్టిన ఎలాంటి చర్యలు తీసుకోవాలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించాలని కోరారు. కాళేశ్వరం నీటితో వ్యాపారం చేస్తామని చెప్పి అప్పులు తెచ్చారని మండిపడ్డారు. కాళేశ్వరం నీటితోనే ఏటా 5వేల కోట్లు సంపాదిస్తామని చెప్పారని సభకు తెలిపారు. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్థిక సంస్థలను తప్పుదోవ పట్టించి, అత్యధిక వడ్డీతో రుణాలు తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని కాగ్ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం విధానాన్ని మార్చుకోవాలంటూ కాగ్ మొటికాయలు వేసిందన్నారు. మిషన్ భగీరథతో 5,700 కోట్లు సంపాదిస్తామని, బ్యాంకులకు తప్పుడు నివేదికలు ఇచ్చి రుణాలు తెచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథతో 10వేల కోట్లు వసూలు చేస్తామని నివేదికలు ఇచ్చారని తెలిపారు. 


దేశంలోనే నంబర్ వన్ స్థానం నిలిపామన్నహరీశ్ రావు


అంతకుముందు మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సొంత ఆదాయ వనరులతో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్వేత పత్రాన్ని విడుదల చేశారు.  42 పేజీల శ్వేత పత్రాన్ని సభ్యులకు అందించారు. ప్రభుత్వ శ్వేతపత్రంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 పేజీల పుస్తకం ఇచ్చి వెంటనే మాట్లాడాలంటే ఎలా..? అని అభ్యంతరం వ్యక్తం చేశారు. నివేదికను చదివే సమయం కూడా తమకు ఇవ్వలేదని.. ముందు రోజే డాక్యుమెంట్‌ ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. ప్రభుత్వ సమాధానం సంతృప్తిగా లేకపోతే నిరసన చేపట్టే అవకాశం తమకు ఉందన్నారు. 15.6 శాతం వృద్ధి రేటుతో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపామన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం...తప్పుల తడకగా ఉందని, అంకెల గారడీ తప్పా ఏమీ లేదన్నారు. రాష్ట్రం దివాళా తీసిందని అని ప్రచారం చేస్తే, పెట్టుబడులు వస్తాయా అని నిలదీశారు. శ్వేతపత్రం విడుదలలో గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కనిపిస్తోందన్నారు.