తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వివాదంలో చిక్కుకున్నారు. తోటి విద్యార్థిపై గతంలో దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో పలు సెక్షన్ల కింద కేసు సైతం నమోదయ్యింది. ఈ వివాదంపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరూ చట్టానికి అతీతులు కాదు అన్నారు. దమ్ముంటే తనతో రాజకీయం చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. పిల్లలను రాజకీయాల కోసం వాడుకోవద్దు అని సూచించారు.


కేసీఆర్ అంత చీటింగ్ తెలివితేటలు లేవన్న బండి సంజయ్, పిల్లల విషయాన్ని రాజకీయాల్లోకి లాగొద్దన్నారు. గతంలో సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు పై ట్రోలింగ్ జరిగిన సమయంలో తాను ఖండించానని గుర్తుచేశారు. గతంలో ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకురావడం, కేసులు పెట్టించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు. యాదాద్రి విషయాన్ని ప్రజలు మరిచిపోవాలని, అరాచకాలను పక్కదోవ పట్టించి రాజకీయాలు చేయడం కంటే తాగి ఫాం హౌజ్ లో పడుకోవడం బెటర్ అన్నారు. చదువుకునే పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న వ్యక్తి కేసీఆర్ అని ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. గతంలో ఉద్యమం పేరుతో వేలాది మంది విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకున్న కేసీఆర్.. ఇప్పుడు మరో ముగ్గురు విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. 



పిల్లలు ఈరోజు కోట్లాడుతారు రేపు మళ్లీ వాళ్లే కలిసిపోయి ఉంటారని, అన్యాయంగా తన కుమారుడిపై సీఎం కేసీఆర్ కేసులు నమోదు చేయించారంటూ మండిపడ్డారు. నా కుమారుడు మీలాగ స్కూళ్లలో మందు పోయించడం, చిన్నారులకు మందు పంపిణీ చేయించడం లాంటివి చేసి వివాదంలో చిక్కుకోలేదన్నారు. చట్టాలను నమ్ముకున్న వ్యక్తినని, ఇది కరెక్టా అని కుటుంబసభ్యులను అడిగి కేసీఆర్ తెలుసుకోవాలన్నారు. కాలేజీ మేనేజ్ మెంట్ ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలుసుకుందా, తల్లిదండ్రులకు సమాచారం అందించడం, కౌన్సెలింగ్ ఇవ్వడం లాంటివి ఎందుకు చేయలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. పిల్లల్ని జైలుకు పంపడం తప్ప, అమాయక యువతులు, ఆడవారిని కాపాడం చేతకాని వ్యక్తి అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు.






బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. cr.no 50/2023 u/s 341, 323, 504, 506 r/w 34 ipc కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని మహింద్రా యూనివర్శిటీలో చదువుతున్న  సాయి భగీరధ్.. ఓ విద్యార్థిని చితకబాదారు. ఈ వీడియోను కూడా తోటి విద్యార్థులు చిత్రీకరించారు. అయితే ఈ దాడి ర్యాగింగ్ కారణంగా చేశారా.. మరో వివాదమా అన్నదానిపై స్పష్టత లేదు.  మహీంద్రా యూనివర్సిటీ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.






భగీరథ్ అందుకే నన్ను కొట్టాడు..
భగీరథ్ చేతిలో తన్నులు తిన్న విద్యార్థి వీడియోపై స్పందించాడు. తనను కొట్టడం నిజమేనని, ఆ ఘటన తర్వాతా ఇద్దరం కాంప్రమైజ్ అయ్యామని క్లారిటీ ఇచ్చాడు. తాను ఓ అమ్మాయికి కాల్ చేసి, మెస్సేజ్ లు చేసి వేధించానని ఒప్పుకున్నాడు. ఇదే విషయమై భగీరథ్ తనపై చేయి చేసుకున్నాడని మరో వీడియోలో బాధిత విద్యార్థి తెలిపాడు. తాను తప్పు చేసినందువల్లే కొట్టాడని, ఆ తరువాత ఇద్దరం కాంప్రమైజ్ అయ్యామన్నాడు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదన్నాడు.