Revanth Reddy Comments: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడి పిల్లల ముందు బూతులు మాట్లాడిన తీరు విమర్శలకు దారి తీస్తోంది. తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే ఉండాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సంకల్పించింది. ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ తన గళం వినిపించడంతో రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ సచివాలయం ముందు తాగుబోతులు, సన్నాసుల విగ్రహం ఉండాలా అంటూ బడి పిల్లల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా, ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాజా వ్యాఖ్యలు చేశారు.






‘‘రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన స్థలంలో కేటీఆర్ వాళ్ళ అయ్య విగ్రహం పెట్టాలి అనుకున్నాడు. కేసీఆర్ సచ్చేది ఎప్పుడు.. ఆ విగ్రహం అయ్యేది ఎప్పుడు. 2009 డిసెంబర్ 9నాడు యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ కేబినెట్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. సోనియా జన్మదినం కూడా డిసెంబర్ 9. అందుకే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేం సచివాలయం బయట కాకుండా లోపలనే ప్రతిష్ఠిస్తాం’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.


నా మాటలు గుర్తుపెట్టుకో చీప్ మినిస్టర్ - కేటీఆర్
దీనిపై కేటీఆర్ స్పందించారు. ‘‘బడి పిల్లల ముందు నువ్వు మాట్లాడిన బూతులు, నీ పెంపకాన్ని చూపిస్తున్నాయి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మానసిక పరిస్థితి త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాను. నా మాటలు గుర్తుపెట్టుకో చీప్ మినిస్టర్ (Cheap Minister).. అధికారంలోకి వచ్చిన తొలిరోజే బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తాం. నీలాంటి ఢిల్లీ గులాం (బానిస) తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణను అర్థం చేసుకోలేరు. చిన్నపిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ నైజం, వ్యక్తిత్వం, ఆయన పెంపకాన్ని సూచిస్తుంది. రేవంత్ నీ మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.


‘‘సెక్రటేరియట్ ముందు దేనికండి రాజీవ్ గాంధీ విగ్రహం.. అసలు రాజీవ్ గాంధీ అనే ఆయనకు తెలంగాణ పదం తెలుసా? ఎప్పుడైనా ఆయన ఉపన్యాసాలలో ఎక్కడైనా తెలంగాణ పదాన్ని ఉచ్చరించడం చూపిస్తారా’’ అని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు.