రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీ రావు మనవరాలు, ఈనాడు పత్రిక ఎండీ కిరణ్ రెండో కుమార్తె వివాహం శనివారం రాత్రి వైభవంగా జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక ఇందుకు వేదిక అయింది. ‘ఈనాడు’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిరణ్‌, మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజకు రెండో కుమార్తె బృహతి. ఈమె వివాహం దండమూడి అమర్‌ మోహన్‌ దాస్‌, అనిత కుమారుడు వెంకట్‌ అక్షయ్‌తో జరిగింది. శనివారం రాత్రి 12.18 (ఆదివారం) గంటలకు వివాహం జరిగింది. ఈ వివాహానికి అగ్ర రాజకీయ నేతలు సహా సినీ ప్రముఖులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 


ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు దంపతులు, సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సహా ఎంతో మంది తెలంగాణ మంత్రులు, మాజీ మంత్రులు వివాహానికి హాజరయ్యారు.


తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, ఏసీబీ అడిషనల్ డీజీ అంజనీకుమార్‌, ఏపీ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ సహా ఉన్నతాధికారులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్‌రావు, విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, తదితరులు కూడా వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.


ఈ వివాహానికి సినీ రంగం నుంచి కూడా ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, రజనీకాంత్‌, అల్లు అరవింద్‌, అశ్వనీదత్‌, డి.సురేశ్‌బాబు, శ్యాంప్రసాద్‌రెడ్డి, శోభు యార్లగడ్డ, జెమినీ కిరణ్‌, అక్కినేని నాగసుశీల, దర్శకులు కె.రాఘవేంద్రరావు, ఎస్‌.ఎస్‌.రాజమౌళి - రమా రాజమౌళి, బోయపాటి శ్రీను తదితరులు కూడా హాజరయ్యారు.


వ్యాపార రంగం నుంచి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల, జీఎంఆర్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ గ్రంధి మల్లికార్జునరావు, దివీస్‌ లేబొరేటరీస్‌ వ్యవస్థాపకులు మురళి కె.దివి, నవయుగ గ్రూప్‌ ఛైర్మన్‌ సి.విశ్వేశ్వరరావు, మైహోం గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు, మేఘా ఇంజినీరింగ్‌ ఎండీ కృష్ణారెడ్డి  తదితరులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.