సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్ అఫ్ ఇండియా కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. తాజాగా ప్రకటించిన సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్కుల్లో (STPI) ఒక్కటంటే ఒక్క దాన్ని తెలంగాణకు కేటాయించక పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లెటర్‌ రాసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, బిహార్, పంజాబ్, జార్ఖండ్, కేరళకు 22 ఎస్టిపిఐలను కేంద్రం కేటాయించించి. తెలంగాణకు ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా కేటాయించకపోవడం తీవ్రమైన అన్యాయమన్నారు మంత్రి కేటీఆర్. 

దేశ ఐటి పరిశ్రమలో అద్భుతంగా రాణిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని... జాతీయ సగటు కన్నా ఎక్కువ వృద్ధి రేటును గత కొన్ని సంవత్సరాలుగా నమోదు చేస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. 2014-15లో 57,258 కోట్ల రూపాయలున్న ఐటీ ఎగుమతులు ఇప్పుడు 1,45,522 కోట్ల రూపాయలకు పెరిగాయని తెలిపారు. ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య కూడా రెట్టింపై 6,28,000పైగా పెరిగిందని తన లేఖలో పేర్కొన్నారు. 

భవిష్యత్తు వృద్ధిని చాటే కమర్షియల్ ఆఫీస్ స్పేస్ విషయంలోనూ తెలంగాణ బెంగళూరును పదే పదే దాటుతున్న విషయాన్ని వివరించారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం ఐటీ పరిశ్రమ అభివృద్ధి కోసం అనేక పాలసీలు తీసుకొచ్చిందని, ఎలక్ట్రానిక్, రూరల్ టెక్నాలజీ, ఇమేజ్, డేటా సెంటర్ వంటి రంగాలను ప్రోత్సహిస్తూ అభివృద్ధి సాధిస్తున్న విషయాన్ని తెలిపారు. అయా పాలసీలకు దేశవ్యాప్తంగా దక్కుతున్న ప్రశంశలను లేఖలో ప్రస్తావించారు. 

హైదరాబాద్ దేశ ఐటీ రంగంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఒక ప్రముఖమైన ఐటీ హబ్‌గా మారిందన్నారు కేటీఆర్. హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీలు కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్‌తోపాటు ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరించేందుకు పాలసీలతోపాటు మౌలిక వసతులు కల్పిస్తున్న సంగతి విడమరచి చెప్పారు కేటీఆర్. ఇప్పటికే ప్రభుత్వం ఆయా పట్టణాలు ఏర్పాటు చేసిన ప్లగ్ అండ్ ప్లే మౌలిక వసతులను వినియోగించుకొని వివిధ కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 

ఇంత పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమ విస్తరిస్తున్న విషయాన్ని పట్టించుకోకుండా సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్కుల కేటాయింపుల్లో తెలంగాణను పరిగణలోకి తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు కేటీఆర్. ఇక్కడి యువత ఉపాధి అవకాశాలను కేంద్ర ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ -ఐటీఐఆర్ రద్దు చేసి, తెలంగాణ ఐటీ రంగానికి, యువతకి తీరని ద్రోహం చేసిన విషయాన్ని తన లేఖలో మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ఈ ఐటీఐఆర్ పునరుద్ధరణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీని కలిసినా,  ఐటీ మంత్రిగా తాను, తమ ఎంపీల బృందం పదేపదే కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తులు చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు. పైగా ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కుల కేటాయింపులో సంపూర్ణంగా తెలంగాణకు అన్యాయం చేయడం కేంద్ర వివక్షపూరిత వైఖరికి నిదర్శనమన్నారు.

దేశంలో అంతర్భాగమైన తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధిస్తే, అది దేశ హితానికి, పురోగతికి తోడ్పడుతుందన్న ఆలోచనతో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులను కేటాయించే విషయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ పట్టణాలకు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులను కేటాయించాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ కోరారు.