భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఏర్పాటు చేసిన ఖమ్మం జిల్లా ఆదివాసీలు ప్రదర్శించిన కొమ్ము కోయ డ్యాన్స్ ను రాహుల్ గాంధీ మహబూబ్ నగర్ పాదయాత్రలో ఆసక్తిగా తిలకించారు. స్త్రీ, పురుషులు కలసి లయబద్ధంగా అడుగులు వేస్తూ చేసే కొమ్ము కోయ ప్రదర్శనలో కళాకారులతో కలిసి రాహుల్ డ్యాన్స్ చేస్తూ వారిని ఉత్సాహ పరిచారు. ఆదివాసీల కళారూపం గురించి రాహుల్ కి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వివరించారు. 
"ఖమ్మంతోపాటు ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొండాకోనల్లో నివసించే ఆదివాసీలు తమదైన శైలిలో అనేకానేక కళారూపాలను సృష్టించారు. వాటిలో ‘కొమ్ము కోయ నృత్యం’ ప్రత్యేకమైంది, సృజనాత్మకమైంది. అడవి దున్న కొమ్ములు, నెమలీకల కలబోతతో.. అసలైన అందానికి అద్దం పడుతుంది. తలమీద ఎద్దు/ అడవి దున్న కొమ్ములతో చేసిన కిరీటం, దాని పైన నెమలి పింఛాలు ధరించి, మెడలో పెద్ద డోలు వేసుకొని చేసే ఈ నృత్య రూపకాన్ని ‘కొమ్ము డోలు’ అని కూడా వ్యవహరిస్తారు. 





పురుషులు కలసి లయబద్ధంగా అడుగులు వేస్తూ చేసే ప్రదర్శన అయినప్పటికీ, పురుషుల నృత్య పద్ధతి, స్త్రీల నృత్య పద్ధతికి కొంత వ్యత్యాసం ఉంటుంది. పురుషులు ప్రత్యేకమైన వస్త్రధారణతో డోళ్లను లయబద్ధంగా వాయిస్తూ, అడుగులో అడుగులు వేసుకుంటూ నృత్యం చేస్తారు. ఈ ప్రదర్శనను ‘పెర్మికోర్‌’ అని పిలుస్తారు. మహిళలు ఆకుపచ్చ చీరలు ధరించి, కొప్పులో పూలు పెట్టుకొని ఒకరిచేతులు ఒకరు పట్టుకొని ‘రేల’ పాటలు పాడుతూ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. దీనిని ‘రేలా నృత్యం’'' అని వ్యవహరిస్తారని భట్టి విక్రమార్క వివరించారు. 10 నుంచి 15 మంది పురుషులు డోళ్లు వాయిస్తూ, లయబద్ధంగా అడుగులు కదిలిస్తూ వలయాకారంగా ‘పెరకోరు’ అంటారని తెలిపారు.


భారత్ జోడో 52 వ రోజున, కోరాపుట్ కు చెందిన మన యువ ఎంపీ సప్తగిరి యులక, దిగ్విజయ్ మరియు సీతక్కతో కలిసి సేవ దళ్ జట్టును ముందుకు నడిపించారు. ఉదయం ధర్మాపూర్ నుండి ఎనుగొండ వరకు యాత్రికులు 15 కిలోమీటర్లు నడిచారు. ఏనుకొండలో ఉదయం 10. 30 గంటలకు విరామం తీసుకోనున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన శిబిరంలో లంచ్ చేయనున్నారు రాహుల్. రాహుల్ గాంధీ తిరిగి సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. జడ్చర్ల జంక్షన్ లో రాహుల్ కార్నర్ మీటింగ్ ఉంది. జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి వద్ద రాహుల్ రాత్రి బస చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. 4 వ రోజు 20.3 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు రాహుల్ గాంధీ.