Rains in Telangana AP: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల తరువాత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం రేపు వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు నేడు ఏపీలోకి ప్రవేశించనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అక్టోబర్ 31 నుంచి ఏపీ, తెలంగాణలో వర్షాలు మొదలవుతాయి. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనాలతో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరంలో సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది.

  
అక్టోబర్ 19 నుంచి ఈశాన్య రుతుపవనాల వాతావరణం కొనసాగుతూ వచ్చింది. వాతావరణ శాఖ అధికారులు ఈశాన్య రుతుపవనాల రాకపై నేడు ప్రకటించనున్నారు. గత ఏడాది నవంబర్‌లో భారీ వర్షాలు, వరదలను మనం చూశాం, కానీ ఈ సారి మరీ అంతగా కాకపోయినా నవంబర్ నెలలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై వర్ష ప్రభావం ఉండనుంది. తమిళనాడు వైపుగా అల్పపీడనాలు వచ్చే ప్రతి సారి నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలతో పాటుగా అన్నమయ్య, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలుంటాయి. అలాగే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి, అవి కూడా కోస్తా (సముద్ర తీరానికి దగ్గర) భాగాల్లో మాత్రమే ఉంటాయని తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
సిత్రాంగ్ తుపాను తీరాన్ని దాటిన మూడు రోజులకు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం నేడు ఏర్పడుతోంది. ఉపరితల ఆవర్తనం తమిళనాడు తీరంలో ఉండటంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఉంటుంది. మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో నేటి నుంచి ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో అక్టోబర్ చివరి నుంచి కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఒకట్రెండు చోట్ల చిరుజల్లులు పడతాయి. మరోవైపు చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం తీరం నుంచి గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.





దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
శ్రీలంక, తమిళనాడుల మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతోంది. రెండు రోజుల తరువాత దీని ప్రభావం ఏపీపై ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలున్నాయి. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. రాయలసీమలో వర్షాలు మొదలయ్యాయి. అన్నమయ్య జిల్లాలోని పలు భాగాలు, చిత్తూరు జిల్లాలోని పలుచోట్ల వర్షాలున్నాయి. నేడు సీమలోని మిగిలిన జిల్లాల్లో, ప్రాంతాల్లో ఈ రోజు వర్షాలుండవని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.






తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాత్రివేల చలి తీవ్రత రాష్ట్రంలో పెరుగుతోంది. రాష్ట్రంలో  వారం రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని జిల్లాల్లో చినుకు కూడా పడటం లేదు. నేడు ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నవంబర్ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. హైదరాబాద్ లో ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. నగరంలో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 30 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదైంది. ఈశాన్య దిశ నుంచి గంటకు 3 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.