కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తెలంగాణా రోడ్లు,రవాణా శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఏప్రిల్ 1వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్ర పరిధిలోని NHAI కి సంబందించిన 32 టోల్ గేట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే టాక్స్ ని మళ్ళీ పెంచబోతున్నారని నాకు తెలియవచ్చింది. ఇప్పటికే మీరు వసూలు చేస్తున్న టోల్ టాక్స్ తెలంగాణ ప్రజలకు పెనుభారంగా మారిందని మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ టోల్ టాక్స్ రేట్లు గనుక పెంచితే "మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు" అవుతుందని లేఖను ప్రారంభించిన మంత్రి వేముల అనేక అంశాలను లేఖద్వారా నితిన్ గడ్కరి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసారు.


2014 సంవత్సరంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 600 కోట్లు టోల్ టాక్స్ వసూలు చేస్తే.. దాన్ని ప్రతీ ఏడాది పెంచుకుంటూ పోతూ..ఈ సంవత్సరం 2023లో 1824 కోట్లు వసూలు చేశారని, అంటే ఈ 9 సంవత్సరాలకాలంలో టోల్ టాక్స్ వసూలు 300% పెంచారని విషయం లేఖలో స్పష్టం చేసారు. ఈ టోల్ టాక్స్ పెంపువల్ల ట్రక్కుల ద్వారా సరఫరా చేసే నిత్యావసరాల ధరలు పెరిగడంతోపాటు సామాన్యులు ప్రయాణించే బస్సు చార్జీలు సైతం పెరిగి జీవనం భారంగా మారిందన్నారు.


ఇదిలా ఉంటే...తెలంగాణ నుంచి ఉన్న ఏకైక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు తరుచూ కేంద్రం జాతీయ రహదారుల కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిందని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం కేటాయింపులు కాగితాల మీద కొండంత ఉంటే..ఖర్చు చేసింది మాత్రం గోరంతేనని తెలిపారు.


2014 నుంచి నేటి వరకు కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 113NH ప్రాజెక్టులు మరియు CRIF  వర్క్స్ గాను మొత్తం కలిపి 1,25,176 కోట్లు మంజూరు చేసినట్టు కాగితాల మీద చూపిస్తున్నా.. ఈ 9 సంవత్సరాల్లో ఖర్చు చేసింది కేవలం 20,350 కోట్లు మాత్రమేనని నితిన్ గడ్కరికి రాసిన లేఖలో పేర్కోన్నారు మంత్రి వేముల.
అలా ఖర్చు చేసిన 20,350 కోట్లకు జాతీయ రహదారుల సంస్థ గత 9 సంవత్సరాల్లో టోల్ టాక్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 9 వేల కోట్ల టోల్ వసూలు చేసిందనే విషయం తెలిపారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిన దాంట్లో తెలంగాణ ప్రజల నుంచి ఇప్పటికే సగం డబ్బులు టోల్ టాక్స్ ద్వారా ముక్కుపిండి వసూలు చేశారని, "కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది" అన్న చందంగా కేంద్రం తీరు ఉందని పరోక్షంగా చురకలంటించారు. అంతే కాకుండా పెట్రోల్,డీజిల్ ధరలు పెంచడంతోపాటు  అదనపు రోడ్ సెస్సుల పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రజల నుండి ఈ 9 సంవత్సరాలకాలంలో కేంద్రం ఎన్ని కోట్లు వసూలు చేసింది.? ఆ డబ్బు ఎటు పోతుందో మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లెక్క చెప్పాల్సిన అవసరముందంటూ లేఖలో కోరారు మంత్రి వేముల.


కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల కోసం తెలంగాణలో లక్షల కోట్లు ఖర్చు చేసిందని పదేపదే అబద్దాలు ప్రచారం చేస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలకు ఈ వాస్తవ విషయాలు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ద్వారా మీరు తెలియజేస్తే మంచిదంటూనే,  మీపార్టీ తెలంగాణా నేతలు ప్రజల్లోకి బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్న అబద్ధాలు, అసత్యపు ప్రసంగాలు మానుకోవాలని సూచించాల్సిన బాధ్యత కూడా మీదేనంటూ గడ్కరికి లేఖ ద్వారా తెలిజేసే ప్రయత్నం ,చేసారు.టోల్ టాక్స్ పెంచుతూ.. పెట్రోల్ డీజిల్ పై సెస్ లు వసూలు చేస్తూ..  సామాన్యులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నానంటూ లేఖలో స్పష్టం చేస్తూ, ఏప్రిల్ 1వ తేదీ నుండి టోల్ టాక్స్ రేట్ల పెంపుదల నిర్ణయాన్ని మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు మంత్రి వేములు ప్రశాంత్ రెడ్డి.