Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రం వచ్చి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నా బొగ్గు బాయి, బొంబాయి, దుబాయి బతుకులు ఏమాత్రం మారలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మన కొలువులు మనకే, మన సంపద మనకే, మన వనరులు మనకే అని ఉద్యమ సమయంలో మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వాటిని విస్మరించారన్నారు. స్థానిక ఉద్యోగులు 99 శాతం ఉన్న సింగరేణిలో 1.05 లక్షల నుంచి 42 వేల ఉద్యోగాలకు కుదించడం దారుణం అన్నారు. సింగరేణిలో పని చేస్తున్న 60 వేల మంది ఉద్యోగాలు తీసివేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను రోడ్డుపాలు చేసిందన్నారు.


మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు నష్టం చేసిన దాంట్లో మొదటి వ్యక్తి సీఎం కేసీఆర్ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో రిటైర్మెంట్ తప్ప కొత్త కొలువుల రిక్రూట్మెంట్ లేదని భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి సంపదను ప్రైవేట్ వ్యక్తులకు దారా దత్తం చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా అని ప్రశ్నించారు. మన సంపద మనం కాపాడుకుందామా వద్దా అని అడిగారు. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ సింగరేణి ఎన్నికలు జరపడం లేదని ఆరోపించారు.


ఎన్నికలు వచ్చినప్పుడే దళిత బంధు, దళిత ముఖ్యమంత్రి, గొర్లు, బర్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, భద్రాద్రి రాముల వారి కళ్యాణానికి కోటి, నిరుద్యోగ భృతి, ఇండ్లు కట్టుకునే వారికి మూడు లక్షల సాయం, పోడు భూముల పట్టాల పంపిణీ కేసీఆర్ కు గుర్తుకు వస్తున్నాయంటూ విమర్శించారు. తొమ్మిదేళ్లుగా ఇవే హామీలు ఇస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 2014 వరకు ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలు సాయం చేసిందని గుర్తు చేశారు. అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని వైఫల్యం చెందిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. కొత్తగా మూడు లక్షల పథకాన్ని తెచ్చిందన్నారు. 2014  సంవత్సరం నుంచి నేటి వరకు ఇండ్ల నిర్మాణం ఖర్చులు మూడు రెట్లు పెరిగినప్పటికీ... ప్రభుత్వ ఇచ్చే సాయం పెద్దగా ఏమీ లేదని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎన్నికల ముందు కుర్చీ వేసుకుని పోడు భూములు పంపిణీ చేస్తానని పదే పదే చెప్పిన ముఖ్యమంత్రికి తొమ్మిదేళ్లవుతున్న కుర్చీ దొరకడం లేదా, లేక కుర్చీ వేసుకునే స్థలం దొరకడం లేదా అని ఎద్దేవా చేశారు. 


ప్రజలను మాయ చేసేందుకు కేసీఆర్ హామీల వర్షం 
బిఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ఓటమి భయంతోనే ప్రజలను మాయ చేసేందుకు కేసీఆర్ హామీల వర్షం కురిపిస్తున్నారంటూ చెప్పారు. మరోసారి కేసీఆర్ భ్రమల్లో పడితే మనకే నష్టం అని వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారత దేశంలో 9 సంవత్సరాలు సెక్రటేరియట్ లేకుండా పరిపాలన జరిగింది ఒక తెలంగాణలోనే అని టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తే వాటికి సమాధానం చెప్పి నిజాయితీ నిరూపించుకోవాల్సింది పోయి నేరస్తులను పిలిచినట్టు సిట్ కార్యాలయానికి పిలవడాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.92 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అధికారులు, బ్యూరో క్రసి నిబద్దతతో బిజినెస్ రూల్స్ ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. అలాగే ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతో అడ్డగోలుగా పనిచేసి ఈ దేశ బ్యూరోక్రసికి మచ్చ తీసుకురావద్దని సూచించారు. పంట నష్టం పై పూటకో మాట చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్న సీఎం కేసీఆర్ వైఖరిని ఖండిస్తున్నట్లు వివరించారు. 


ప్రశ్నాపత్రం తయారు చేసింది వాళ్లే.. లీకు చేసింది వాళ్లే  
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వాస్తవమే కదా అని.. ప్రశ్నాపత్రం తయారు చేసింది వాళ్లే.. లీకు చేసింది వాళ్లే అని చెప్పుకొచ్చారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీలో పాలనధ్యక్షులు నీతి మంతులమని సమర్థించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్ వెంట దేశ ప్రజలు వస్తుంటే... దేశద్రోహులు, ఆర్థిక నేరస్తులు మోడీ వెంట వెళ్తున్నారని ఫైర్ అయ్యారు. బ్యాంకులో నుంచి తీసుకున్న కోట్ల సంపద ఎగ్గొడుతున్న ఆర్థిక నేరస్తులతో అంటకాగుతున్న మోడీకి ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు. రాహుల్ గాంధీకి శిక్ష పడేలా చేసి, పార్లమెంటుకు రాకుండా అనర్హత వేటు వేసి, ఇప్పుడు ఇల్లు లేకుండా చేసిన బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారన్నారు. రాహుల్ గాంధీ పైన ఎన్నిసార్లు అనర్హత వేటు వేస్తే అన్ని సార్లు ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకొని గెలిపించి పార్లమెంటుకు పంపుతారన్నారు. గాంధీ కుటుంబస్తులు తమ జీవితాలను, ఆస్తులు దేశానికి అంకితం చేశారని.. ఆ చరిత్ర గురించి అందరికీ తెలుసన్నారు.


ఒక్కసారి ఎమ్మెల్యే పదవి చేపడితేనే కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని.. చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కుటుంబం 9 ఏళ్లలో లక్షల కోట్లు సంపాదన పోగేసుకున్నారన్నారు. ఈ దేశాన్ని చాలా సంవత్సరాల పాటు పరిపాలించిన రాహుల్ గాంధీ కుటుంబం సొంత ఇల్లు లేకపోగా ఉన్న క్వార్టర్ ను ఖాళీ చేయాలని బీజేపీ చేస్తుందన్నారు. దేశ సంపద, ప్రజాస్వామ్యం ప్రజలకే చెందాలని కోరుకునే రాహుల్ గాంధీపై బీజేపీ కక్ష సాధింపు చర్యలను ఖండిస్తున్నామన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తాను చేసే పాదయాత్రలో ప్రధాని మోడీ ఆగడాలు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్యాగాలను చాటి చెబుతానన్నారు. 


ప్రాణహిత పారుతున్న సాగునీటికి నోచుకోని బెల్లంపల్లి ప్రజలు 
2008 -09 సంవత్సరంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా బెల్లంపల్లికి మంచినీళ్లు అందించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ పథకం ద్వారా బెల్లంపల్లికి కుమురం భీం ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించే కార్యక్రమం చేపట్టారన్నారు. మిషన్ భగీరథ పనులు పూర్తయ్యాయని, బిల్లులు డ్రా చేసినప్పటికీ మంచినీళ్లను అందించలేని దౌర్భాగ్య స్థితిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. కుమురం భీం ప్రాజెక్టు ద్వారా తీసుకువచ్చే నీటిలో ఓబీ కాలుష్యం కలిసి తాగడానికి పనికి రాకుండా పోతున్నాయన్నారు. పైపులు అమ్ముకోవడం కోసమే మిషన్ భగీరథ స్కీం తెచ్చారన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం భగీరథ పైపులు అమ్ముకోవడం కోసమే కొమరం భీం ప్రాజెక్టుకు మార్చారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.


స్థానిక ఎమ్మెల్యే సింగరేణి స్థలాలు కబ్జా చేయడానికి నియోజకవర్గానికి వస్తారనే ప్రచారం ఉందన్నారు. ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులను తన బినామీ రియల్ ఎస్టేట్ వెంచర్లలో రోడ్లు వేయడానికి ఎమ్మెల్యే ఖర్చు పెడుతున్నట్లు  ఆరోపణలు వచ్చాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య కాదు, చేతగాని చెన్నయ్య అని ప్రజలు పిలుస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ అసమర్థ పాలన, చేతగాని చెన్నయ్య లాంటి ఎమ్మెల్యే నిర్వాకం వల్ల అభివృద్ధికి ఆమడ దూరంలో బెల్లంపల్లి ఉందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ, పిసిసి ఉపాధ్యక్షులు మదన్మోహన్రావు, గండ్ర సుజాత,  నాతరి స్వామి, చిలుముల శంకర్ తదితరులు ఉన్నారు.