రాహుల్‌ ఓయూ పర్యటనపై టీఆర్‌ెస్, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో వార్ నడుస్తోంది. యూనివర్శిటీల్లో రాజకీయాలు చేసేందుకు వీల్లేదని... రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని యూనివర్శిటీని రిక్వస్ట్ చేసింది అధికార పార్టీ. ఇది రాజకీయాలకు అతీతంగా జరిగే సమావేశమని... తాము ఎలాంటి కండువాలు లేకుండా సమావేశం జరుపుతామంటోంది తెలంగాణ కాంగ్రెస్. ఓయూలో రాహుల్ పర్యటించి విద్యార్థుల సమస్యలు మాత్రమే తెలుసుకుంటారని అందుకే వారితో ఇంట్రాక్ట్ అవుతారని వివరణ ఇస్తోంది. 


కాంగ్రెస్ పార్టీ చేసిన రిక్వస్ట్‌ను ఉస్మానియా యూనివర్శిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ రవీందర్‌ యాదవ్ తిరస్కరించారు. సమావేశాని అనుమతి ఇవ్వలేమని తేల్చేశారు. రాహుల్ పర్యటనపై ఇప్పటికే  హైకోర్టు మెట్లెక్కింది. ఈ విషయంలో వీసీదే తుది నిర్ణయమని అభిప్రాయపడింది కోర్టు. 


ఇప్పుడు వీసి కూడా కాంగ్రెస్ అభ్యర్థనను తిరస్కరించడంతో మరోసారి హైకోర్టుకు వెళ్లి సభకు అనుమతి తెచ్చుకోవాలని భావించింది కాంగ్రెస్ పార్టీ. అందుకే హైకోర్టులో హౌజ్‌మోషన్ పిటిషన్ వేసింది. హైకోర్టు ఆదేశాలను ఓయూ వీసీ పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొంది. 


తెలంగాణలో ఈ నెల 6వ తేదీ రాహుల్‌ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులతో సమావేశమవ్వాలని భావించారు. దీని కోసం కొన్ని రోజుల నుంచి తీవ్ర దుమారం రేగుతోంది.
అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.   


స్వయంగా కాంగ్రెస్ నేతలు ఉస్మానియా వీసీని కలిసి సభకు అనుమతి ఇవ్వాలని రిక్వస్ట్ చేశారు. రెండు పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు ఉస్మానియా యూనివర్శిటీలో పోటాపోటీగా ధర్నాలు చేశాయి. ఒకరు సభకు అనుమతి ఇవ్వాలని.. మరొకరు వద్దని నినాదాలు చేశాయి. ఈ ధర్నాలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్ లీడర్లు కూడా పాల్గొన్నారు. ఈ ఆందోళనలు, అనంతరం అరెస్టు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. 


కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను అరెస్టు చేయడం దుమారం రేగింది. ఓయూ వీసీ ఛాంబర్‌ వద్ద ధర్నా చేసిన ఘటనలో ఆయనతోపాటు 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా కానిస్టేబుల్‌ పట్ల విద్యార్థి సంఘం నేతలు అసభ్యంగా ప్రవర్తించారని కేసు పెట్టారు. మహిళా కానిస్టేబుల్‌ ఫిర్యాదుతో పలు సెక్షన్లపై 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని స్థానిక కోర్టులో హాజరుపర్చగా కోర్టుకు వారికి 14 రోజులు రిమాండ్‌ విధించింది. దీంతో వారిని చంచల్ గుడా జైలుకు తరలించారు. 


రిమాండ్‌కు పంపించిన ఎన్‌ఎస్‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బలమూరి వెంకట్, మరో 17 మందిని జైలులో టీపీసీసీ బృందం ములాఖత్ అయ్యారు. ములాఖత్ అయిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్స్ గీతారెడ్డి, తూర్పు జగ్గారెడ్డి , అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఫిరోజ్ ఖాన్, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.