హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసును పోలీసులు 12 గంటల్లోపే ఛేదించారు. నిందితురాలి బ్యాగ్‌లో ఉన్న షాపింగ్ బిల్లు ఆధారంగా కేసును సాల్వ్ చేశారు.  వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని విచారణలో తేలింది. భర్తే నిందితుడిగా తేల్చారు.


కొత్తగూడెం బ్రిడ్జికి సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న యువతీ, యువకుల మృతదేహాలు నిన్న గుర్తించారు స్థానికులు. కొత్తగూడెం బ్రిడ్జ్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో నగ్నంగా మృతదేహాలు పడి ఉండటం స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. గుర్తు పట్టడానికి వీలులేకుండా శవాలు కుళ్లిన స్థితిలో ఉన్నాయి. ఏకాంతంగా ఉన్న జంటను దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు మొదట భావించారు. 


కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు మృతులు కవాడిగూడకు చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన యువకుడిని యశ్వంత్‌, యువతిని జ్యోతిగా తేల్చారు. యువతి ముఖం గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉంది. సంఘటన స్థలానికి కొద్ది దూరంలోనే హోండా యాక్టివాను పోలీసులు గుర్తించారు. జాతీయ రహదారికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ శవాలు పడి ఉండటంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


సంఘటన స్థలంలో ఓ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ బ్యాగులో సెంట్రో చెప్పుల దుకాణంలో చెప్పులు కొనుగోలు చేసిన రశీదు లభ్యమైంది. ఈ రశీదుపై జ్యోతి అనే పేరు ఉంది. జ్యోతికి ఈ చెప్పులను శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పించాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫోన్‌లో చెప్పాడు. ఫోలీసులతో ఫోన్ మాట్లాడిన తర్వాత శ్రీనివాస్ ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉంది.


సమాచారం ఇచ్చిన తర్వాత శ్రీనివాస్ ఫోన్ స్విచ్ఛాప్ చేయడంతో పోలీసులుకు ఆయనపైనే అనుమానం వచ్చింది. ఆ దిశగానే ఎంక్వయిరీ స్టార్ట్ చేసి ఆయన ఉన్న లొకేషన్ గుర్తించారు. విజయవాడలో శ్రీనివాస్‌ను పట్టుకొని ప్రశ్నిస్తే అసలు గుట్టు  తెలిసింది. తానే వాళ్లిద్దరిని హత్య చేసినట్టు శ్రీనివాస్ అంగీకరించాడు. 


గత కొంతకాలంగో యశ్వంత్, జ్యోతి మధ్య వివాహేతర సంబంధం ఉంది. శ్రీనివాస్‌తో వివాహమైన జ్యోతికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా యశ్వంత్‌తో క్లోజ్‌గా ఉండటం ఇష్టం లేని శ్రీనివాస్... ఇద్దర్నీ హత్య చేసి నగరు శివారులో పడేశాడు. ఈయనకు మరో నలుగురు సహకరించారు. వాళ్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 


శవాల నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుర్వాసన వచ్చే ప్రాంతానికి వెళ్లి పోలీసులు పరిశీలిస్తే రెండు డెడ్ బాడీలు కన్పించాయి. సంఘటన స్థలంలో జ్యోతి, యశ్వంత్ కి చెందిన వస్తువులను దూరంగా నిందితులు విసిరివేశారు. జ్యోతి బ్యాగ్‌లో దొరికిన రిసీట్ కారణంగానే పోలీసులు ఈజీగా ఈ కేసును ఛేదించారు.