TV9 Ravi Prakash News: టీవీ 9 వాటాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు లేవని, అన్నీ చట్ట బద్ధంగానే జరిగాయని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్ బుధవారం (జూన్ 15) తీర్పు ఇచ్చింది. అలంద మీడియా ద్వారా వాటాలు కొనుగోలు చేసిన మైహోమ్‌ గ్రూప్‌ యజమానులు జూపల్లి జగపతిరావు సహా ఇతర డైరెక్టర్లను ఇబ్బంది పెట్టడానికి మాజీ సీఈవో రవి ప్రకాష్, ఇతరులు ఈ పిటిషన్‌ వేశారని ధర్మాసనం అభిప్రాయపడింది. అందువల్ల ప్రతివాదులకు రూ.10 లక్షలు చెల్లించాలని రవి ప్రకాష్‌తో పాటు కేవీఎన్ మూర్తిలను ధర్మాసనం ఆదేశించింది. 


టీవీ9కు చెందిన ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ వాటాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, ఆ సంస్థను స్వాధీనం చేసుకున్నవారిని నియంత్రించాలని కోరుతూ ఛానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్, కేవీఎన్ మూర్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న ఎన్‌సీఎల్‌టీ బుధవారం తీర్పు ఇచ్చింది. వాటాల అమ్మకాలకు సంబంధించిన ఒప్పందం రవి ప్రకాశ్‌కు తెలిసే జరిగిందని, ఆ ప్రక్రియలో ఆయన భాగమేనని ధర్మాసనం తేల్చింది.


టీవీ9 ప్రమోటర్‌ అయిన ఏబీసీఎల్‌లో రవి ప్రకాష్‌కు 9 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. కంపెనీ నుంచి సీఈఓ అంటే రవిప్రకాష్‌, సీఎఫ్‌ఓ మూర్తిలను తొలగించడం కంపెనీల చట్టం అనుగుణంగానే జరిగిందని, ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదని బెంచ్‌ పేర్కొంది. కంపెనీ యాజమాన్యం బదిలీలో అవకతవకలు జరిగాయని పిటీషనర్‌ ఎక్కడా నిరూపించలేకపోయారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.