Bandi Sanjay Meets Governor: గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులపైన లాఠీ ఛార్జ్ చేసిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ఫిర్యాదు చేశారు. బుధవారం మధ్యాహ్నం బండి సంజయ్ సహా బీజేపీ నేతలు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. ఈ మేరకు ఆమెకు వినతి పత్రం అందించారు. భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇప్పించి ప్రాజెక్టును పూర్తి చేయాలని వారు కోరారు.


‘‘సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవేల్లి, గండిపేల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల పైన పోలీసులు అక్రమ లాఠీ ఛార్జ్ చేశారు. జూన్ 13 వ తేదీ (సోమవారం) అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల ప్రాంతంలో దాదాపు 500 మంది బలగాలతో గుడాటిపల్లిలో ప్రవేశించిన పోలీసులు ఆ గ్రామంలో కరెంట్ కట్ చేసి ప్రతి ఇంటిలోకి దౌర్జన్యంగా దూరి విచక్షణా రహితంగా లాఠీచార్జి చేశారు. పిల్లలు, మహిళలు, వృద్దులు అని చూడకుండా పోలీసులు దాడి చేశారు.


స్తీలు, ఆడపిల్లల పై మగ పోలీసు లు అసభ్యంగా ప్రవర్తిచారు. స్త్రీలను అరెస్టు చేసే విషయంలో మహిళా పోలీసులు ఉండాలన్న కనీస నిబంధనను పాటించలేదు. పోలీసుల దాడిలో చాలా మంది గాయపడ్డారు. స్త్రీలు స్పృహ తప్పి పడిపోయారు. మరుసటి రోజు అంటే 14.06.2022 నాడు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే మాపైకి టీఆరెస్ కార్యకర్తల్ని ఉసిగొల్పారు. పోలీసులు వచ్చి ముఖ్యుల్ని  కాపాడాల్సింది పోయి మా పైనే మళ్ళీ లాఠీ ఛార్జి చేశారు. పోలీసుల దాడిలో చాలా మంది గాయపడ్డారు. వారిలో కొంత మందిని మీ ముందుకు తీసుకుని వచ్చాము.’’


‘‘మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తే మేము ప్రాజెక్ట్ కు వ్యతిరేకం కాదు. మాకు దక్కాల్సిన పరిహారం మాకు ఇప్పించాలని ఆ గ్రామ ప్రజలు చెప్పిన పోలీసులు పట్టించుకోకుండా విచక్షణ రహితంగా కొట్టారు. భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వర్తింప చేసిన తర్వాతనే ట్రయల్ రన్ చేయాలని గౌరవ హైకోర్టు కూడా ఆదేశించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై గ్రీన్ ట్రిబ్యునల్ కూడా స్టే ఇచ్చింది.’’


‘‘నిర్వాసితులకు రావాల్సిన పరిహరం ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని పోలీసు దాడులతో బెదిరించి గ్రామాలను ఖాళీ చేయించాలని అనుకుంటోంది. దాదాపు వెయ్యి మందికి పైగా భూ నిర్వాసితులకు న్యాయం కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద కొంత మంది మైనర్లు.. మేజర్లు అయ్యారు, వృద్ధులకు అందవాల్సిన ప్యాకేజ్ లు అందలేదు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు రాలేదు. ఇలా భూ నిర్వాసితుల సమస్యలు ఇంకా పరిష్కరం కాలేదు.’’


‘‘భూ నిర్వాసితులపైన లాఠీ ఛార్జ్ చేసిన పోలీస్ అధికారులను గుర్తించి వారి పైన చర్యలు తీసుకునేలాగా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని విజ్ణప్తి చేస్తున్నాం. అదేవిధంగా భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించి గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని తెలంగాణ బీజేపీ పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.’’ అని బీజేపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.