Medical colleges in Telangana | హైదరాబాద్: తెలంగాణలో మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మెదక్, యాదాద్రి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేసిన 4 మెడికల్ కాలేజీల (Medical Colleges)కు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఆదేశించింది. కాలేజీలకు అనుమతిపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య శాఖ నేడు (సెప్టెంబర్ 10న) లేఖ పంపించింది. మంజూరైన నాలుగు కాలేజీలలో ఒక్కో కాలేజీలో‌ 50 ఎంబీబీఎస్ సీట్ల (MBBS Seats) చొప్పున, తెలంగాణలో మరో 200 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 


తెలంగాణలో 4090కి పెరిగిన మెడికల్ సీట్లు


ఈ ఏడాది ఇప్పటికే గద్వాల్, నారాయణపేట్, ములుగు, నర్సంపేట్ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (National Medical Commission) అనుమతి రావడం తెలిసిందే. కేంద్రం తాజా నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం 8 కాలేజీల్లో కలిపి 400 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్త సీట్లతో కలుసుకుని తెలంగాణలో ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం సీట్ల సంఖ్య 4090 కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 8 కాలేజీలకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసింది. జూన్‌లో ఈ కాలేజీల పరిశీలనకు వచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ అధికారులు, ఇక్కడ అవసరమైన సౌకర్యాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీచింగ్ స్టాఫ్, సౌకర్యాలు లేకుండా తాము అనుమతులు ఇవ్వలేమని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. సంబంధిత శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. కొత్త కాలేజీల మంజూరు కోసం చేయాల్సిన ఏర్పాట్లకు అవసరమైన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. 


ఫస్ట్ అప్పీల్‌తో 4 కాలేజీలకు అనుమతి


గతంలో నేషనల్ మెడికల్ కమిషన్ చూపించి లోపాలను సవరించిన తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ అప్పీల్‌కు వెళ్లింది. ఆ అప్పీల్ కారణంగా గద్వాల్, నారాయణపేట్, ములుగు, నర్సంపేట్ మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. మిగిలిన 4 కాలేజీలకు పర్మిషన్ మాత్రం రాలేదు. దాంతో మిగతా 4 కాలేజీలకు అనుమతులపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఎప్పటికప్పుడూ మానిటర్ చేశారు. మహేశ్వరం, కుత్బుల్లాపూర్, యాదాద్రి, మెదక్ మెడికల్ కాలేజీలకు స్టాఫ్‌ను నియమించారు. ఇటీవల జరిగిన జనరల్ ట్రాన్స్‌ఫర్లలో తొలుత ఆ నాలుగు మెడికల్ కాలేజీల్లోని ఖాళీలను నింపి, ఆ తర్వాతే మిగిలిన కాలేజీల్లోకి సిబ్బందిని బదిలీ చేసింది ప్రభుత్వం‌. ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు అర్హత ఉన్న వారికి ప్రమోషన్లు ఇచ్చారు. మెడికల్ కాలేజీతో పాటు అక్కడి హాస్పిట‌ల్‌లో ఉండాల్సిన లాబోరేటరీ, డయాగ్నస్టిక్స్ ఎక్వి‌ప్‌మెంట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇలా ఎన్‌ఎంసీ లేవనెత్తిన అన్ని లోపాలను సవరించి కేంద్ర ఆరోగ్యశాఖకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు సెకండ్ అప్పీల్‌ చేశారు. 


సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా ఆదేశాలతో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ వాణి, ఇతర ఆఫీసర్లు, డాక్టర్ల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్యశాఖ, ఎన్‌ఎంసీ అధికారులను కలిశారు. కాలేజీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, ఇంకేమైనా అవసరం ఉంటే అవి కూడా సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. లెటర్ ఆఫ్ పర్మిషన్ జారీ‌చేయాలని ఎన్‌ఎంసీని ఆదేశించింది.


కొత్తగా మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కృతజ్ఞతలు తెలిపారు. కాలేజీల ఏర్పాటు కోసం సకాలంలో‌ అవసరమైన నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మెడికల్‌ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ వాణి, అడిషనల్‌ డీఎంఈ, ఇతర ఉన్నతాధికారులను మంత్రి దామోదర అభినందించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను డెవలప్ చేసి, ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.


Also Read: Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి