రూ.120 కోట్లతో స్టేట్ కాన్సర్ సెంటర్ గా ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ ను తీర్చిదిద్దుతామన్నారు తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు. చాపకింద నీరులా విస్తరిస్తున్న రొమ్ము కేన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజల్ని కాపాడేందుకు ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ నెలను ప్రతి ఏడాది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నేస్ మంత్ గా నిర్వహిస్తున్నారు. నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ వద్ద వరల్డ్ బ్రెస్ట్ కేన్సర్ నెల సందర్భంగా నిర్వహిస్తున్న అవగాహన వాక్, మారథాన్ జెండా ఊపి ప్రారంభించారు మంత్రి హరీష్ రావు.


అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎంఎన్‌జే, నిమ్స్ ఆసుపత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులకు అవసరమైన చికిత్స అందించుతున్నాయని.. ఎంఎన్‌జే హాస్పిటల్ ను రూ.120 కోట్లతో స్టేట్ కాన్సర్ సెంటర్ గా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎంఎన్‌జేలో కొత్తగా 30 కోట్లతో 8 మాడ్యులర్ థియేటర్లు ప్రారంభించామని, ఇందులో ఒకటి రోబోటిక్ థియేటర్ కావడం విశేషం అన్నారు. పేషెంట్లు పెరుగుతున్న క్రమంలో పడకల సంఖ్యను 450 నుండి 750 కి పెంచుకుంటున్నము. నాలుగు ఎకరాల స్థలంలో 5 అంతస్తుల కొత్త భవనం ఏర్పాటు చేసుకున్నం. త్వరలో ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.


30, 40 ఏళ్లకే క్యాన్సర్
మారిన జీవనశైలి, మారిన ఆహార అలవాట్లు తదితర కారణాల వల్ల చిన్న తనంలోనే రోగాల బారిన పడుతున్నారని, ప్రపంచాన్ని భయపెడుతున్న రొమ్ము కేన్సర్ విషయంలో ఇదే జరుగుతున్నది. ఒకప్పుడు పెద్ద వయస్సులో మాత్రమే కనిపించే ఈ మహమ్మారి నేడు 30 - 40 ఏళ్ల వయస్సు వారి లోనూ ఇది కనిపిస్తున్నదని చెప్పారు. రొమ్ము క్యాన్సర్ అవగాహనకు అంతర్జాతీయ చిహ్నంగా పింక్ రిబ్బన్ ను మనం ప్రదర్శిస్తుంటాము. ఇది ఒక మంచి కార్యక్రమం. రొమ్ము కేన్సర్ పై అవగాహన కల్పించడంలో భాగంగా వాక్, మారథాన్ నిర్వహించడం మంచి ఆలోచన. ఇందులో పాల్గొన్న వారిని అభినందించారు. 






అమెరికాలో అయితే జీవిత కాలంలో ప్రతి 8 మంది మహిళల్లో కనీసం ఒకరు రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షా 80 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయని అంచనా ఉండగా, ఆలస్యంగా గుర్తించడం, సకాలంలో చికిత్స అందక పోవడం కారణంగా ఇందులో 50 శాతం దాకా మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. గత పదేళ్ళలో చూస్తే మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని, గర్భాశయ క్యాన్సర్ కంటే ఇవే ఎక్కువగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 40 - 50 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు ఎక్కువగా రొమ్ము కేన్సర్ బారిన పడుతున్నారని చెప్పారు.
అవగాహన లేకపోవడం, అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో నిర్ధారణ
వ్యాధికి సంబంధించిన అవగాహన లేకపోవడం కారణంగా అడ్వాన్స్డ్ స్టేజ్ లో నిర్ధారణ జరుగుతున్నది. దీంతో చికిత్స అందించడం కష్టంగా ఉంటున్నది. 70 శాతం కేసుల విషయంలో ఇలా జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముందుగా గుర్తిస్తే వంద శాతం ప్రాణాలు కాపాడవచ్చు. బయటికి వెళ్తే జంక్ ఫుడ్, విస్తృతంగా ప్లాస్టిక్ వినియోగం, శారీరక శ్రమ లేకపోవడం... ఇలా అనేక అంశాలు కారణం అవుతున్నాయని గుర్తుచేశారు మంత్రి హరీష్ రావు.
తెలంగాణలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు
తెలంగాణలోని క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, మహిళల్లో కాన్సర్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ బారిన ఎక్కువ మంది పడుతున్నారు. పట్టణ జనాభాలో రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తులు, గర్భాశయం, అన్నవాహిక క్యాన్సర్లు పెరుగుతున్నాయి. అయితే ఈ మహమ్మారి నుండి కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఈ భయంకరమైన వ్యాధి నుండి మరింత మంది ప్రాణాలను కాపాడటానికి ముందస్తు నిర్ధారణ ఒక్కటే మార్గం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మంత్రి అభిప్రాయపడ్డారు.


రొమ్ము క్యాన్సర్ కారణాలివే..
ముఖ్యంగా రొమ్ము కేన్సర్ విషయంలో, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, బిడ్డకు పాలివ్వకపోవడం, కుటుంబ ఆరోగ్య చరిత్ర, అధిక బరువు కలిగి ఉండటం, దూమపానం, మద్య పానం వంటి చెడు అలవాట్లు కారణంగా మహిళలో రొమ్ము కేన్సర్ వస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. రొమ్ము కేన్సర్ పై అవగాహనతో ఉండటం, మామో గ్రామ్ పరీక్షలు చేయించుకోవటం, కనీస వ్యాయామం, మంచి జీవన శైలి అలవాటు చేసుకోవటం వల్ల దీని బారి నుండి కాపాడుకోవచ్చు. ప్రాథమిక దశలోనే రోగ నిర్ధారణ జరగటం వల్ల త్వరగా చికిత్స పొంది వంద శాతం రోగం నయం చేసుకోవటం సాధ్యం అవుతుంది. 


క్యాన్సర్ మహమ్మారి నుండి ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం మూడంచెల వ్యూహం అనుసరిస్తున్నదని.. ముందుగా గుర్తించడం, క్యాన్సర్ వచ్చిన వారికి మెరుగైన చికిత్స అందించడం.. వారిని కాపాడుకోవడం లక్ష్యంగా పని చేస్తుందన్నారు. మొబైల్ స్క్రీనింగ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి చికిత్స అందిస్తున్నాం. ఒక్కో నెలలో సగటున 6 క్యాంపులు పెడుతూ, సగటున 600 నుండి 800 మందికి పరీక్షలు చేస్తున్నాము. నిర్ధారణ అయినా వారిని మెరుగైన చికిత్స కోసం MNJ ఆసుపత్రికి పంపిస్తున్నాము. క్యాన్సర్ చికిత్స పై తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం రు. 750 కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల కేన్సర్ లకు సమగ్రమైన కేన్సర్ చికిత్సలు అందిస్తున్నది. సర్జికల్, రేడియేషన్, మెడికల్ ఆంకాలజి, బ్లడ్ కేన్సర్, బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్, పాలియేటివ్, మొబైల్ స్క్రీనింగ్.. ఇలా 10 రకాల కార్యక్రమాలు చేస్తుందన్నారు. 


ప్రైవేటులో రూ.20 లక్షల దాకా విలువ చేసే బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ చికిత్సలను తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా అందిస్తున్నది. రేడియో థెరపీ, కీమో థెరపీ చికిత్సలను ఉచితంగా అందిస్తుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 33 జిల్లాల్లో పాలియేటివ్ కేర్ లు ప్రారంభించి అవసాన దశలో ఉన్నవారికి ఆత్మీయంగా సేవలు, తెలంగాణ డయాగ్నొస్టిక్ పథకం ద్వారా జిల్లా స్థాయి లోనే కాన్సర్ ను గుర్తించడానికి అవసరమైన మమ్మోగ్రఫీ, బయాప్సీ వంటి అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, ఎం ఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ జయలత, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు.