Rains in Telangana AP: ఉత్తర, దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడం ఉత్తర, పశ్చిమ దిశలలో ప్రయాణించి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. నేడు బంగాళాఖాతంలో వాయుగుండం తుపానుగా మారుతుందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. అయితే సిత్రాంగ్ తుపానుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఎలాంటి ముప్పు లేదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అక్టోబర్ 24 ఒడిశా తీరాన్ని చేరుకుని, అక్టోబర్ 25న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య సిత్రాంగ్ తుపాను తీరం దాటుతుందని అంచనా వేశారు. 


సిత్రాంగ్ తుపాను, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. వాయుగుండం తుపానుగా మారడంతో మరో మూడు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేశాయి అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు. ఏపీకి సిత్రాంగ్ తుపాను ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, సిత్రాంగ్ తుఫానుకి ఎటువంటి సంబంధం ఉండదని, ఏపీ, తెలంగాణలో వర్షాలు మాత్రం ఉంటాయి. ఈశాన్య రుతుపవనాలు ఏపీలో నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. 
 
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో నేడు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను ప్రభావంతో అక్టోబరు 23 వరకూ ఇలాగే వాతావరణ పరిస్థితి ఉండొచ్చని తాజా వెదర్ బులెటిన్ లో తెలిపారు. రాష్ట్రానికి ఎలాంటి వర్ష హెచ్చరికలు జారీ కాలేదు. నిన్న రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, నిజామాబాద్, వికారాబాద్, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసింది. నేడు సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. తూర్పు దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 






ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
బంగాళాఖాతంలో పరిస్ధితి చూస్తే జంట ఉపరితల ఆవర్తనాల ప్రాంతాలు, అలాగే తెలంగాణ రాష్ట్రం మీదుగా అధికపీడన ప్రాంతం ఏర్పడింది. సిత్రాంగ్ తుపాను ముప్పు తప్పినప్పటికీ, ఏపీపై కాస్త ప్రభావం చూపుతోంది. తుపాను ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పలుచోట్ల వర్షాలున్నాయి. వర్ష సూచనతో మూడు రోజులవరకు ఎల్లో వార్నింగ్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీరంలో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, వీటి వేగం 55 కిలోమీటర్లు దాటే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం సురక్షితం కాదని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి సిత్రాంగ్ తుపానుగా మారింది. తుపాను ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై స్వల్పంగా ఉంటుంది. రెండు రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలున్నాయి. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమపై సిత్రాంగ్ ప్రభావం చాలా తక్కువగా ఉంది. అన్నమయ్య జిల్లాలోని పలుచోట్ల ముఖ్యంగా మదనపల్లి - పుంగనూరు బెల్ట్, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ, కడప జిల్లాలోని జమ్మలమడుగు పరిసరాల్లో వర్షాలు కురవనున్నాయి.