Mrityunjaya Homam For KCR Good Health: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు (Kalvakuntla Chandrashekar Rao) అనారోగ్య సమస్యలన్నీ తొలగి, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi Rathod) ప్రత్యేక యాగం నిర్వహించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రుల నివాస ప్రాంగణంలో నేడు (మార్చి 14) వేదపండితులతో మృత్యుంజయ హోమం (Mrityunjaya Homam) నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఇటీవల హఠాత్తుగా అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందిన వేళ.. ఆయన ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో కొనసాగుతూ ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శక్తి పొందాలని కోరుకుంటూ తాను ఈ మృత్యుంజయ హోమం జరిపినట్లుగా మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.


సోమవారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ మృత్యుంజయ హోమం పూర్ణాహుతికి రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy), రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Erraballi Dayakar Rao), రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర షెడ్యూల్ తెగల, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహకులు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ (MP Santosh Kumar), మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సురభి వాణీ దేవి, తక్కెళ్లపల్లి రవీందర్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణా రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి, మహబూబాబాద్ జడ్పీ చైర్ పర్సన్ బిందు, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు, టీఆర్ఎస్ నేతలు కొంపల్లి శ్రీనివాస రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి, సురేశ్ రావు, శ్రీరామ్ నాయక్, సిరి నాయక్, శ్రీమతి వనజా శ్రీరామ్, తదితరులు హాజరై, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.