తెలంగాణ(Telangana) రాష్ట్రంలో గిరిజన ఆవాసాలు, వ్యవసాయ క్షేత్రాలు, పరిశ్రమలకు 3ఫేజ్ విద్యుత్ కల్పించే దిశగా చర్యలు ముమ్మరం చేసింది. రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.. అధికారులకు టార్గెట్ ఫిక్స్‌ చేశారు. గిరిజన ప్రాంతాల్లో అన్ని ఇళ్లకు 3 ఫేజ్ విద్యుత్ ఉండాల్సిందేనంటూ తేల్చి చెప్పారు. 


2022 తర్వాత కరెంటు లేని గిరిజన ఆవాసం ఉండటానికి వీల్లేదని మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathod) స్పష్టం చేశారు. 3ఫేజ్ విద్యుత్ లేని వ్యవసాయ క్షేత్రంగానీ, పరిశ్రమలుగానీ ఉండొద్దని అధికారులను ఆదేశించారు. గిరిజన ఆవాసాలన్నింటికి విద్యుదీకరణ, గిరిజన వ్యవసాయం, పరిశ్రమలకు 3ఫేజ్ విద్యుత్ కల్పన, గిరివికాసం అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 


రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి 3467 ఆవాసాలకు ఇంకా విద్యుత్‌ కనెక్షన్ లేనట్టు గుర్తించారు అధికారులు. ఇందులో 2795 గ్రామాలకు 3 ఫేజ్ విద్యుదీకరణ పూర్తైంది. మిగిలిన 19 శాతం ఆవాసాలకు పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అటవీ శాఖ అనుమతులు, కొన్ని చోట్ల ఆవాసాలు దూరంగా ఉండడం వంటి సమస్యలతోనే వాటికి విద్యుత్ సదుపాయం కల్పించడం ఆలస్యమవుతుందని వివరణ ఇచ్చారు. 


పెండింగ్‌ ఇళ్లకు కూడా విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులతో కాన్ఫరెన్సు నిర్వహించి, సమస్యలు లేకుండా సమన్వయం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. 


విద్యుత్ లైన్లు వేయలేని గిరిజన ఆవాసాలకు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ఇందుకోసం తెలంగాణ స్టేట్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పోరేషన్(TSREDC)లిమిటెడ్ సంస్థ సహకారాన్ని తీసుకోవాలన్నారు. సంప్రదాయ విద్యుత్ కల్పించడంలో విద్యుత్ శాఖకు ఉన్న ఇబ్బందులను తొలగించే సమన్వయ బాధ్యతను గిరిజన సంక్షేమ శాఖ తీసుకుంటుందని తెలిపారు. దీని కోసం త్వరలోనే సమావేశం నిర్వహించి  వంద శాతం గిరిజన ఆవాసాలకు విద్యుదీకరణ, 3ఫేజ్ విద్యుత్ పూర్తి చేయాలని సూచించారు. 


గత రెండేళ్లుగా 3 ఫేజ్ విద్యుదీకరణ జరిగిన గిరిజన ఆవాసాల్లో సిఎం గిరివికాసం పథకం కింద 34,838 గిరిజనులకు 69675 ఎకరాలలో లబ్ది చేకూరిందన్నారు మంత్రి. దీన్ని మరింత పెంచాలని సూచించారు. గత బడ్దెట్‌లో కేటాయించిన నిధులు పుష్కలంగా వాడుకోవాలని అధికారలకు తెలిపారు. 


ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషన్ క్రిస్టినా జడ్ చోంగ్తు, అటవీ శాఖ పీసీసీఎఫ్(ఎస్.ఎఫ్) ఆర్.ఎం దోబీరియల్, టిఎస్ఎన్పిడిసిఎల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మోహన్ రెడ్డి, టిఎస్ఎస్పీడిసిఎల్ డైరెక్టర్(కమర్షియల్) కె. రాములు, టిఎస్ఆర్ఈడిసిఓ జనరల్ మేనేజర్ బిపిఎస్ ప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడు సర్వేశ్వర్ రెడ్డి, సంయుక్త సంచాలకులు వి. సముజ్వల పాల్గొన్నారు.