కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టే 2023-24 కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ మోదీ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో పారిశ్రామిక పురోగతికి  కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహాయ సహకారాలు అందిస్తే దేశానికి సహకరించినట్లే అవుతుందని చెప్పారు. దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకంగా మారిందని, న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కేటీఆర్ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ లేఖ రాశారు.


తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు, హామీలను నిలబెట్టుకునే సమయం వచ్చిందని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ అభివృద్ధి పైన కేంద్ర ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకోవడానికి వచ్చే కేంద్ర బడ్జెట్ 2023-24 మంచి అవకాశం అని కేటీఆర్ అన్నారు. న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులను రాష్ట్రానికి ఈ బడ్జెట్‌లోనైనా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణకి వివిధ శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయంపై కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ రాశారు. 


తెలంగాణలో పరిశ్రమల శాఖ చేపట్టిన పలు కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించాల్సిన బడ్జెట్ నిధుల సహకారంపై కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి శనివారం (జనవరి 14) లేఖ రాశారు. ‘‘8 ఏళ్లలో దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషించింది. ఇక్కడి ప్రాజెక్టులకు జాతీయ ప్రాధాన్యం ఉంది. రాష్ట్రంలోని జహీరాబాద్‌ నిమ్జ్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించాలి. 


హైదరాబాద్‌ - వరంగల్‌, హైదరాబాద్‌ - నాగ్‌పూర్‌, హైదరాబాద్‌ - విజయవాడ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వమే చేయాలి. జడ్చర్ల ఇండస్ట్రియల్ పార్కులో ఉమ్మడి వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు, బ్రౌన్‌ ఫీల్డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లు మంజూరు చేయాలి. వాటిని అప్‌గ్రేడేషన్‌ కూడా చేయాలి. హైదరాబాద్‌ నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌ ఫార్మా సిటీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలి. గతంలో హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఐటీఐఆర్‌ లేదా దానికి సమానమైన ప్రాజెక్టును తెలంగాణకు ఇవ్వాలి. ఆదిలాబాద్‌ సీసీఐ యూనిట్‌ను పునరుద్ధరణ చేయాలి. రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి. ఈ అంశాలపై 8 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి మేం విజ్ఞప్తి చేస్తున్నాం. అయినా ఎలాంటి ఫలితం రావడం లేదు’’ అని మంత్రి కేటీఆర్‌ లేఖలో వివరించారు.


టీ హబ్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్
మంచి ఆలోచన ఉన్న స్టార్టప్ లకు నిధులు ఇబ్బంది కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. డ‌ల్లాస్ వెంచ‌ర్ క్యాపిట‌ల్‌తో టీ హ‌బ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియా ఫండ్ పేరుతో టీ హ‌బ్‌కు డ‌ల్లాస్ వెంచ‌ర్ నిధులు సమకూర్చుతుంది. హైదరాబాద్ టీ హ‌బ్‌లో జ‌రిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... డ‌ల్లాస్ వెంచ‌ర్ కంపెనీకి అభినంద‌న‌లు తెలిపారు. డ‌ల్లాస్ వెంచ‌ర్ సంస్థ భార‌త్‌లో అనేక స్టార్టప్స్ నెల‌కొల్పింద‌న్నారు. భార‌త్‌లో ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన గొప్పద‌ని మంత్రి కేటీఆర్ కొనియాడారు. హైద‌రాబాద్‌లో సుమారు ఆరు వేల స్టార్టప్‌లు ఉన్నాయని గుర్తుచేశారు.