CM KCR Comments: తెలంగాణ వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో, యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగగా మారిన రోజే.. భారత దేశానికి సంపూర్ణ క్రాంతి చేకూరుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దేశ, రాష్ట్ర  రైతాంగానికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర, దేశ ప్రజలంతా సుఖ సంతోషాల నడుమ హాయిగా పండుగ జరుపుకోవాలని సూచించారు. పంట పొలాల నుంచి ధాన్యపు రాశులు ఇండ్లకు చేరుకున్న శుభ సందర్భంలో రైతన్న జరుపుకునే సంబురమే సంక్రాంతి పండుగని, నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ అని సీఎం వివరించారు. నేడు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పునురుజ్జీవింప చేసేందుకు చేపట్టిన కార్యాచరణతో తెలంగాణ పల్లెలు పచ్చని పంట పొలాలు, ధాన్యపు రాశులు, పాడి పశువులు, కమ్మని మట్టి వాసనలతో సంక్రాంతి శోభను సంతరించుకుని వైభవోపేతంగా వెలుగొందుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి మార్గ దర్శకంగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు.


ఉచిత విద్యుత్, సాగునీటి కోసం 2 లక్షల 16 వేల కోట్లు ఖర్చు చేశాం..! 


రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా లక్షలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని సీఎం చెప్పారు. తెలంగాణ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటి వరకు రూ. 2,16,000 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసిందనీ వివరించారు. రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది తార్కాణం అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక రైతు సంక్షేమ వ్యవసాయరంగ అభివృద్ది కార్యాచరణతో నాడు రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఒక కోటీ 31 లక్షల ఎకరాలు మాత్రమే ఉన్న సాగు విస్తీర్ణం ఉండగా... నేడు 2 కోట్ల 4 లక్షల ఎకరాలకు పెరిగిందని అన్నారు. ఇది దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పరిణామని సీఎం తెలిపారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి పథకాలే తీసుకు రావాలని సూచించారు. 


దేశ వ్యవసాయ రంగ నమూనాను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది..


ఒకనాడు దండుగ అన్న వ్యవసాయం తెలంగాణలో నేడు పండుగ అయిందని,  వ్యవసాయరంగాన్ని నమ్ముకుంటే జీవితానికి ఢోకా లేదనే విశ్వాసం తెలంగాణ రైతుల జీవితాల్లో తొణికిస లాడుతున్నదని సీఎం కేసీఆర్ వివరించారు. ఇదే విశ్వాసాన్ని దేశ రైతాంగంతో పాటు మేల్కొల్పుతామని సీఎం స్పష్టం చేశారు. ఈ దిశగా యావత్ భారత ప్రజల సహకారంతో, సమిష్టి కృషితో దేశ వ్యవసాయ రంగ నమూనాను సమూలంగా మార్చి గుణాత్మక అభివృద్దికి బాటలు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలంతా మకర సంక్రాంతి పండుగను సుఖ సంతోషాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనీ, ప్రతీ ఇల్లు  సిరి సంపదలతో తులతూగాలని  సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.