ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు. మొన్న మహబూబ్‌నగర్‌లో పర్యటించిన ప్రధాని... ఇవాళ నిజమాబాద్‌ వస్తున్నారు.  రాష్ట్రంలో ప్రధాని వరుస పర్యటనలపై బీఆర్‌ఎస్‌ విమర్శలు గుప్పిస్తోంది. ఎన్నికలప్పుడే ప్రధానికి తెలంగాణ గుర్తొస్తుందా అంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ఫైరవుతున్నారు. మంత్రి  కేటీఆర్‌ కూడా ప్రధాని వరుస పర్యటనపై కౌంటర్‌ ఇచ్చారు. మూడు రోజుల్లో రెండోసారి రాష్ట్రానికి వస్తున్న మోదీజీ.. మూడు హామీల సంగతి ఏంటి అంటూ ట్విట్టర్‌ వేదికగా...  ప్రశ్నలు సంధించారు మంత్రి కేటీఆర్‌.


కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, పాలమూరు ప్రాజెక్టు జాతీయహోదాపై ప్రధాని మోదీని నిలదీశారు మంత్రి కేటీఆర్‌. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం  పోసేదెప్పుడు ? మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు? మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు? అంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు.  అంతేకాదు.. మూడురోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్న మోదీజీ... ఆ మూడు విభజన హక్కులకు దిక్కేది? అంటూ నిలదీశారు. పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ  అబద్ధాల జాతర? అంటూ క్వశ్చన్‌ చేశారు కేటీఆర్‌. మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు.. అని అడిగారు. గుండెల్లో గుజరాత్‌ను పెట్టుకుని తెలంగాణ  గుండెల్లో గునపాలు గుచ్చుతారా అంటూ ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఉపిరి తీశారు.. లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీఐఆర్‌ను ఆగం చేశారు, మా ప్రాజెక్టుకు జాతీయ  హోదా హామీని తుంగలో తొక్కారు, దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసి వెళ్లిపోయారు అంటూ ట్విట్టర్‌ వేదికగా మోదీని గట్టిగా నిలదీశారు మంత్రి కేటీఆర్‌.


బీజేపీ పదేళ్ల పాలనలో 4కోట్ల తెలంగాణ ప్రజల్నే కాదు.. 140 కోట్ల భారతీయులను మోసం చేశారని అన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారు...  దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు ఇస్తామన్నారు.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఊదరగొట్టారు.. పెట్రోల్ ధరలు నియంత్రిస్తామన్నారు. మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాట అయినా నెరవేర్చరా..? అని ప్రశ్నించారు కేటీఆర్‌. 


పసుపు బోర్డు ప్రకటన కూడా.. మహిళా రిజర్వేషన్ మాదిరిగానే ఉంది అంటూ కౌంటర్‌ ఇచ్చారు. ఎన్నికల వేళ హంగామా ఇప్పుడు.. మరి అది అమలు అయ్యేది ఎప్పుడో  అంటూ పసుపు బోర్డు ప్రకటనపై సెటైర్‌ వేశారు. ప్రధానిగా మీ పదేళ్ల పాలనలో అదానికి తప్ప.. ఆమ్ ఆద్మీకి దక్కిందేంటి అంటూ ప్రశ్నించారు కేటీఆర్‌. మా మూడు ప్రధాన  హామీలు నెరవేర్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా అని చెప్పారు. మళ్లీ వంద స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ అన్నారు కేటీఆర్‌.


రెండు రోజుల క్రితం.. మోదీ మహబూబ్‌నగర్‌ పర్యటన సందర్భంగా కూడా మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ ప్రజలు కాదు... జాతీయస్థాయిలో అధికార మార్పు కావాలని దేశ ప్రజలు కోరుకుంటారని చెప్పారు. BRS పార్టీ స్టీరింగ్ కేసీఆర్ గారి చేతిలోనే పదిలంగా ఉందని... కానీ బీజేపీ స్టీరింగ్ అదాని చేతిలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. తెలంగాణ రైతుల రుణమాఫీ జరగనే లేదని మాట్లాడటం... మిలియన్ డాలర్ జోక్ అని సెటైర్‌ వేశారు కేటీఆర్‌. స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక కొత్త రాష్ట్రం రెండుసార్లు రైతుల రుణమాఫీకి నడుం బిగించిన సందర్భం తెలంగాణలో మాత్రమే ఆవిష్కృతమైందన్నారు. అన్నదాత అప్పులు మాఫీ చేసిన జైకిసాన్ ప్రభుత్వం తమది చెప్పారు కేటీఆర్‌.