ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఫ‌లితంగానే నేడు కండ్లకోయ‌లో ఐటీ పార్కును నిర్మించుకుంటున్నామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌ల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ ఐటీ పార్కు ఆరంభం ఒక ప్రారంభం మాత్రమే అని మంత్రి చెప్పారు. హైదరాబాద్‌కు అవతలి వైపున (ఉత్తర దిక్కున) కండ్లకోయ ప్రాంతంలో తెలంగాణ గేట్ వే పేరుతో నిర్మించనున్న ఐటీ పార్కుకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మేడ్చల్ జిల్లాలో ఓఆర్ఆర్‌కు సమీపంలో ఈ పార్కును నిర్మించనున్నారు. దీన్ని ప్రభుత్వం రూ.వంద కోట్లతో నిర్మిస్తోంది. మొత్తం 10 ఎకరాల స్థలంలో 40 మీటర్ల ఎత్తు, 14 అంతస్తులతో ఈ ఐటీ పార్కు ఉండనుంది. ఫలితంగా 5 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం అందుబాటులోకి వస్తుంది. ఈ ఐటీ పార్కులో 100  కంపెనీల ద్వారా 50 వేల మందికి ఉపాధి కల్పించనున్నారు. ఈ భాధ్యతలను టీఎస్‌ఐఐసీకి అప్పగించింది. ఇప్పటికే 70కి పైగా సంస్థలు కార్యాలయ స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ పార్కులో సమావేశ మందిరాలు (కాన్ఫరెన్స్ హాల్స్), భారీ పార్కింగు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు.


కండ్లకోయ‌లో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోయే ఐటీ పార్కుకు శంకుస్థాపన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్రసంగించారు. ‘‘ఉత్తర హైద‌రాబాద్‌లో 35 ఇంజినీరింగ్, 50 డిగ్రీ కాలేజీలు 30 ఎంబీఏ కాలేజీల‌తో పాటు ప‌లు ఫార్మసీ, మెడిక‌ల్, న‌ర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి ఏడాది 15 నుంచి 20 వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇక్కడి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. పశ్చిమ హైద‌రాబాద్‌కు వెళ్లి ఐటీ ఉద్యోగాలు చేయ‌డం కంటే, ఉత్తర హైద‌రాబాద్‌లోనే ఐటీ ఉద్యోగాలు చేసేలా న‌గ‌రానికి న‌లువైపులా ఐటీ పార్కులు నిర్మిస్తున్నాం. ద‌గ్గర్లోనే ఎంఎంటీఎస్, జాతీయ ర‌హ‌దారులు ఉన్నాయి. మంచి అర్బన్ పార్కులు ఉన్నాయి. కాబ‌ట్టి ఈ ప్రాంతానికి ఉజ్వల భ‌విష్యత్ ఉంది’’ అని కేటీఆర్ అన్నారు.


‘‘గ‌త ఏడున్నరేళ్లలో ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీల‌తో పాటు అనేక కంపెనీలు హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెట్టాయి. యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్‌, మైక్రోసాప్ట్ లాంటి కంపెనీలు కార్యక‌లాపాలు ప్రారంభించాయి. అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంప‌స్‌ను హైద‌రాబాద్‌లో నెల‌కొల్పింది. 31 ల‌క్షల చ‌ద‌ర‌పు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేశారు.’’ అని కేటీఆర్ గుర్తు చేశారు.


మంత్రి మల్లారెడ్డి భావోద్వేగ ప్రసంగం
ఈ కార్యక్రమంలో మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ప్రసంగిస్తూ భావోద్వేగం చెందారు. ఒక‌ప్పుడు తాను పాలు అమ్మి జీవ‌నం సాగించానని గుర్తు చేసుకున్నారు. అలాంటి తాను గతంలో పార్లమెంటు సభ్యుడు, ఇప్పుడు మంత్రి స్థాయికి ఎదిగానని అన్నారు. నిరంత‌రం క‌ష్టప‌డడం వల్లే దేశంలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేష‌న‌లిస్ట్‌గా అయ్యానని గుర్తు చేసుకున్నారు. స‌క్సెస్‌కు ఒక మోడ‌ల్‌గా నిలిచాను అని అన్నారు. ‘‘నా జ‌న్మలో కూడా ఊహించ‌లేదు. సీఎం కేసీఆర్ ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తార‌ని. ఒక‌ప్పుడు ఐటీ అంటే మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ.. ఇప్పుడు ఐటీ కంపెనీలు కూడా హైద‌రాబాద్‌కు నార్త్ సైడ్ విస్తరిస్తున్నాయి. ఒక ల‌క్ష మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మేడ్చల్‌లో ఉన్నారు. ఐటీ పార్కు ఇక్కడ నెల‌కొల్పడం మా పిల్లల అదృష్టం. రాబోయే రోజులు మీవే’’ అని మంత్రి మ‌ల్లారెడ్డి చెప్పారు.