హైదరాబాద్ శివారు మన్నెగూడలో ఓ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధపడిందని ఆమెను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం (డిసెంబరు 9) జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. తాజాగా ఈ ఘటనపై యువతి తండ్రి దామోదర్‌ రెడ్డి ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ప్రధాన నిందితుడిగా ఉన్న నవీన్‌ రెడ్డి, అతని అనుచరులపై ఆదిభట్ల పోలీసులు హత్యాయత్నం, కిడ్నాప్, దాడితో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.


బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రకారం.. ‘‘ఓ బ్యాడ్మింటన్‌ ట్రైనింగ్ సెంటర్ లో నా కూతురికి నవీన్‌ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ప్రేమ, పెళ్లి పేరుతో రెండేళ్లుగా నా కూతుర్ని వేధించారు. నిన్న నవీన్‌ రెడ్డి ఓ 50 మందిని వెంట వేసుకొని వచ్చిన నా ఇంటిపై దాడి చేశారు. ఐరన్‌ రాడ్లు, రాళ్లు తీసుకొని ఇంటిపై దాడికి దిగారు. నా కుమార్తె, మా ఫ్యామిలీని చంపాలని ఇంట్లోకి చొరబడి అన్నీ నాశనం చేశారు. నవీన్‌ రెడ్డి నా తలపై రాడ్డుతో దాడి చేశాడు. నా స్నేహితులపైనా దాడి చేశారు. దాడి తర్వాత నా కుమార్తెను కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు’’ అని కిడ్నాప్ కు గురైన యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


నిందితుడు నవీన్ రెడ్డి వాదన మరోలా..


‘‘హిందూ సంప్రదాయం ప్రకారం మాకు పెళ్లి జరిగింది. 2021 ఆగస్టు 4వ తేదీన బాపట్ల జిల్లా వలపర్ల గుడిలో మా వివాహం జరిగింది. ఆమె బీడీఎస్ చదువుతుండడంతో అది పూర్తి అయ్యేదాకా పెళ్లి ఫొటోలు బయటకు రావొద్దని వైశాలి కండీషన్ పెట్టింది. 2021 జనవరి నుంచి మేం ప్రేమలో ఉన్నాం. వైశాలి కుటుంబ సభ్యులు నాతో డబ్బులు కూడా ఖర్చుపెట్టించారు. వైశాలి తల్లితండ్రులు బీడీఎస్ కంప్లీట్ కాగానే పెళ్లి చేస్తామని మాట ఇచ్చి తప్పారు. నా డబ్బులతోనే వైజాగ్, అరకు, వంజంగి, కూర్గ్, మంగళూరు, గోకర్ణ, గోవా లాంటి అన్ని ప్రదేశాలు తిరిగారు. వైశాలి పేరు మీద వోల్వోకారు, వైశాలి ఫాదర్ కు రెండు కాఫీ షాపులను రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చాను’’ అని నవీన్ రెడ్డి కోర్టుకు తెలిపారు.


ఎమ్మెల్యే పరామర్శ


మన్నెగూడలో వైశాలి కుటుంబ సభ్యులను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నవీన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ ఘటన దురదృష్టకరం. ఇంటి మీదికి వచ్చి దాడి చేసి కిడ్నాప్ చేయడం హేయమైన చర్య. నవీన్ రెడ్డి చేసిన సైకో ఆలోచన తప్పు. నవీన్ రెడ్డితో పాటు ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నిన్న జరిగిన దాడిలో కొంతమందికి గాయాలయ్యాయి. కిడ్నాప్ ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నాం. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. సత్వర న్యాయం జరిగేలా చూస్తాం’’ అని ఎమ్మెల్యే బాధితులకు భరోసా ఇచ్చారు.