సుఖేశ్ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి క్రిమినల్‌ను తాను ఎప్పుడూ కలవలేదంటూనే అతనిపై న్యాయపోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. ఇలాంటివి ప్రచురించే ముందు మీడియా కూడా ఆలోచించుకోవాలని సూచించారు. 


గత కొన్ని నెలలుగా కవితను టార్గెట్ చేసిన సుఖేశ్ చంద్రశేఖర్‌ ఈసారి కేటీఆర్ ప్రస్తావ తీసుకొచ్చారు. ఈమేరకు గవర్నర్‌కు లేఖ రాసినట్టు కూడా ఆయన లాయర్‌ చెప్పుకొచ్చారు. దీనిపై కేటీఆర్‌ నుంచి తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది. 


ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ ఆరోపణలు వెనక్కి తీసుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేటీఆర్‌ హెచ్చరించారు. వెంటనే క్షమాపణ చెప్పాలని సుఖేశ్ లాయర్‌కు కేటీఆర్‌ తరుఫు లాయర్ నోటీసులు పంపించారు. లేకుంటే పరువునష్టం కేసు వేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు సుఖేశ్ తరఫు లాయర్‌ అనంత్‌ మాలిక్‌కు నోటీసు పంపారు. తెలంగాణ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు ఫిర్యాదు పేరుతో రాసిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 


సుఖేశ్ ఏమన్నారంటే?


మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరోసారి కవితతో పాటు కేటీఆర్‌పై కూడా ఆరోపణలు చేస్తూ లేఖ విడుదల చేశారు. ఈ సారి నేరగా తెలంగాణ గవర్నర్  తమిళసై సౌందర్ రాజన్‌కు  లేఖ రాశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌పై  సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ రాశారు. ‘‘నా వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ తరపు సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారు. కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్లలోని ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఆధారాలు ఇస్తే రూ.100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశపెడుతున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. కవితకు నాకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉంది. ఈ ఆధారాలని ఇప్పటికే ఈడీకి 65 -బి సర్టిఫికెట్ రూపంలో ఇచ్చేశా. కవిత నుంచి రూ.15 కోట్ల నగదు తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ తరపు వారికి అందజేశా. ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నా’’ అంటూ గవర్నర్‌ తమిళసైకు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు.


ఈ లేఖ అంశం మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. సుఖేష్ తనపై ఆరోపణలు చేసినట్లుగా ఇప్పుడే తెలిసిందని.. ఇలాంటి వ్యక్తి గురించి తాను ఎప్పుడూ వినలేదన్నారు. అతనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాననని ప్రకటించారు. నోటెడ్ క్రిమినల్స్ ఇలాంటి ఆరోపణలు చేసనప్పుడు ప్రచారం చేసేటప్పుడు, పబ్లిష్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. కల్వకుంట్ల కవిత, కేజ్రీవాల్ లపై ఆరోపణలు చేస్తూ చాలా సార్లు సుఖేష్ లేఖలు రాశారు కానీ.. కేటీఆర్ ప్రస్తావన మాత్రం ఎప్పుడూ చేయలేదు. తొలి సారి కేటీఆర్ ప్రస్తావన తెస్తూ లేఖ రాయడం సంచలనంగా మారింది.