KTR Allegations on Congress Govt: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రూ.వందల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పౌరసరఫరాల శాఖలో ఈ భారీ స్కామ్ జరిగిందని అన్నారు. సన్న బియ్యం, ధాన్యం కొనుగోలు కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లలో అవకతవకలు జరిగాయని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ఈ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆదివారం (మే 26) కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.


క్వింటాల్ కు రూ.150 నుంచి రూ.223 రూపాయలు అదనంగా చెల్లించాలని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లను బెదిరిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. లిప్ట్ చేయకపోయినా చేసినట్టు తాము చూపిస్తామని చెప్పారని అన్నారు. అదనంగా క్వింటాల్ కు రూ.200 చొప్పున తీసుకున్నా.. దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నులకు రూ.700 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో కుంభకోణాల కుంభమేళా జరుగుతుందని అన్నారు. ప్రభుత్వంతో సంబంధం లేని ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరపున డబ్బుల వసూళ్లు ఎలా చేస్తాయని ప్రశ్నించారు. మిల్లర్లతో కుమ్మక్కై భారీ స్కామ్ చేశారని.. ఆ నాలుగు సంస్థలు కుమ్మక్కై మిల్లర్లను బెదిరిస్తున్నాయని కేటీఆర్ అన్నారు.


రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పని చేసిన రవీందర్ సింగ్ 15 రోజుల క్రితం ఈ ఆరోపణలను తొలిసారిగా చేశారని.. కేటీఆర్ అన్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి, సీఎం రేవంత్ నుంచి ఎలాంటి వివరణ రాలేదని అన్నారు.


ఇక జూన్ 2వ తేదీతో తెలంగాణ ఏర్పడి పదేళ్లు అవుతున్నందున తెలంగాణ భవన్ లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ పాలన సాక్షిగా వెయ్యేళ్లైనా చెక్కు చెదరని పునాదిని బీఆర్ఎస్​ ప్రభుత్వం వేసిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే అధికార పగ్గాలు చేపట్టిన గులాబీ పార్టీ, మొదటిసారి ప్రతిపక్ష హోదాలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించనుందని కేటీఆర్ అన్నారు.


రకరకాల ట్యాక్స్ లు వసూలు
‘‘15 రోజుల కింద ఈ కుంభకోణాన్ని మా పార్టీ బయటకు తీసినా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. BRS అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కామ్ లు. గల్లిమే లూటో, ఢిల్లీలో భాటో అన్నదే కాంగ్రెస్ నీతి. కాంగ్రెస్ అంటే కుంభకోణాల కుంభమేళా. ఇప్పటికే రాష్ట్రంలో B టాక్స్, U టాక్స్, ఆర్ఆర్ టాక్స్ రాజ్యమేలుతుంది. ఇప్పుడు మీకు ఈ కుంభకోణం లో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఢిల్లీ పెద్దల ప్రమేయం కూడా ఉంది. 


35 లక్షల ధాన్యం అమ్మకం కోసం గ్లోబల్ టెండర్ల పేరుతో పిలిచిన మొదటి స్కాం. 2.20 లక్షల టన్నుల సన్న బియ్యం కొనుగోలు పక్రియ రెండో కుంభకోణం. మొత్తం వెయ్యి కోట్ల రూపాయల స్కాం జరిగింది. ధాన్యం అమ్మకం కోసం అవినీతి కుట్రకు  తెర తీసింది. జనవరి 25వ తేదీన కమిటీ వేసి, అదే రోజున కమిటీ ఏర్పాటు చేసి, ఈరోజు మార్గదర్శకాలు విడుదల చేసి, అదే రోజు టెండర్లను పిలిచింది. హామీల అమలులో లేని ఈ జెడ్ స్పీడు అవినీతి సొమ్ము కోసం మాత్రం కాంగ్రెస్ పెద్దలు చూపించారు. 


ధాన్యంకు 2100 క్వింటాలు చొప్పున స్థానికంగా రైస్ మిల్లు కొంటాం అన్న ఇవ్వకుండా, అర్హత నిబంధనలో మార్పులు చేసి గ్లోబల్ టెండర్ల పేరుతో కుట్రకు  తెరలేపింది. ఈ గ్లోబల్ టెండర్లను.. కేంద్రీయ భండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ అనే సంస్థలు దక్కించుకున్నాయి. ఈ సంస్థల్లో కేంద్రీయ బండాను మా ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెడితే... ఆ సంస్థకు నిబంధనలో మినహాయింపు నుంచి బ్లాక్ లిస్టు కంపెనీని టెండర్లను పాల్గొనేలా చేసింది. టెండర్ లో క్వింటాలుకు  రూ.1885 నుంచి రూ.2007కు కోట్ చేసి.. దక్కించుకున్నాయి. 93 నుంచి 200 రూపాయల తక్కువకు గ్లోబల్ టెండర్లు పిలిచి కట్టబెట్టారు. 


కానీ గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తీసుకెళ్లకుండా.. ఈ నాలుగు సంస్థలు కేవలం ధాన్యం మాత్రమే సేకరించుకుని వెళ్లాలి కానీ... మిల్లర్లతో డబ్బులు తీసుకొని మనీ లాండరింగ్  పాల్పడుతున్నాయి. క్వింటాలుకు రూ.2230 తమకు చెల్లించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 వేల రైస్ మిల్లర్లను.. ఈ కాంట్రాక్ట్ సంస్థలు బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. ఇందుకు కాంట్రాక్ట్ సంస్థలు చెబుతున్న కారణాలు.. సీఎం పేషీకి ఖర్చయిందట.. ఢిల్లీ ఏఐసీసీ పెద్దలకు వాటాలు పంపించారట.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖజానా నింపారట.. 
అందుకే క్వింటాలుకు  కనీసం 150 రూపాయల వరకు అదనంగా కలిపి చెల్లించాలని రైస్ మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు అదనపుగా డబ్బులు ఇయ్యకుంటే సివిల్ సప్లై శాఖతోనే విజిలెన్స్ శాఖ కానీ దాడులు చేసి కేసులు పెట్టిస్తామని రైస్ మిల్లులను భయపెట్టిస్తున్నాయి 


సన్నబియ్యం కొనుగోలులోనూ..
‘‘రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం సేకరించాల్సిన 2.20 లక్షల సన్న బియ్యం కొనుగోలు లో 300 కోట్ల రూపాయల అవినీతికి తెరలేపింది. రాష్ట్రంలో 35 రూపాయలకు కొత్త సన్నబియ్యం అందుబాటులో ఉంటే 57 రూపాయలకు కిలో చొప్పున కొంటుంది. సన్న బియ్యం కొనుగోలుకు కూడా గ్లోబల్ టెండర్ అనే కుట్రకు లేపింది. ధాన్యం సేకరణలో కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టిన అవే నాలుగు కంపెనీలకు బియ్యం కొనుగోలును అవే సంస్థలకు కట్టబెట్టింది. నాలుగు సంస్థలు దాదాపు ఒకే ధరకు టెండర్ వేసినవి అంటే... ఇది రింగు కాకపోవడం కాక మరలేమిటి?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.