తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం (డిసెంబర్ 10) తెలంగాణ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నేడు 9 ఫైల్స్ పై మంత్రి సంతకాలు చేశారు. నల్గొండ నుంచి ధర్మాపురం, ముషంపల్లి రోడ్డును నాలుగు లైన్‌లుగా చేయడం, కొడంగల్, దుడ్యాల రహదారి విస్తీర్ణానికి సంబంధించిన ఫైల్స్ కూడా ఉన్నాయి. తాను సంతకం చేసిన ఈ 9 ఫైల్స్ లో 5 ఫైల్స్ కు అనుమతి గురించి సోమవారం నితిన్ గడ్కరీని కలుస్తానని చెప్పారు. అయితే, గత పదేళ్లుగా రోడ్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదని కోమటిరెడ్డి విమర్శించారు. తాము రానున్న రెండు మూడేళ్లలో రహదారుల విస్తీర్ణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీలను తమ ప్రభుత్వం వీలైనంత తొందరగా అమలు చేస్తుందని అన్నారు.


కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఏం చేశారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌ రావు మాట్లాడుతున్నారని అన్నారు. వారు పదేళ్లుగా ఏం చేశారని ప్రశ్నించారు. తాము ఎవరి మీద ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపులు చేపట్టబోమని, తప్పులు ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తిరిగి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని.. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా రాష్ట్రంలో రహదారుల బాగుపడడానికి పని చేస్తానని అన్నారు. 


భువనగిరి ఎంపీ పదవికి సోమవారం రాజీనామా చేస్తానని చెప్పారు. రాష్ట్రంలోని 14 రహదారులకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి అడుగుతానని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్ (RRR) సౌత్‌ను జాతీయ రహదారిగా గుర్తించాలని నితిన్ గడ్కరీని కోరతానని అన్నారు. అలాగే విజయవాడ - హైదరాబాద్ రహదారిని 6 లైన్‌లకు, హైదరాబాద్ - కల్వకుర్తి రోడ్డు 4 లైన్‌లకు, సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF)ని పెంచాలని అడుగుతానని చెప్పారు. హైదరాబాద్ - విజయవాడ రోడ్ లో మల్కాపూర్ వరకు కొంత పని అయిపోయిందని.. వచ్చే 6 నెలల్లో మిగతా దాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ - విజయవాడ రహదారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రెండున్నర గంటల్లో విజయవాడ చేరుకునేలా విస్తరిస్తామని అన్నారు.


త్వరలోనే కొత్త కౌన్సిల్ నిర్మాణం
కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. త్వరలో కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణం చేపడతామని అన్నారు. పాత భవనం ఆవరణలోనే ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. సీఎల్‌పీ కార్యాలయాలు కూడా కూల్చేసి కొత్త బిల్డింగులను నిర్మిస్తామని అన్నారు.