కేసిఆర్ కొత్త జాతీయ పార్టీ ఎలా ఉండబోతుంది? విధి విధనాలు ఏమిటీ? ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలోనే కాదు సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే కేసిఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చవచ్చు. జాతీయ రాజకీయాల్లో కేసిఆర్ ఆగమనాన్ని కొంతమంది స్వాగతిస్తున్నారు. అయితే ఒక్క తెలంగాణ రాష్ట్రం కాకుండా మిగిలిన 28 రాష్ట్రాల్లో కూడా కేసిఆర్ స్వాగతించాలి. కేసిఆర్ పెట్టబోతున్న కొత్త జాతీయ పార్టీ అటు బీజేపీకీ, ఇటు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుందని అంటున్నారు. మరి కేసిఆర్ నూతన పార్టీని ఆహ్వానించే మిగిలిన మిత్రులు ఎవరూ? మరొక పార్టీ తమ రాష్ట్రంలోకి ఆహ్వనించే వారు ఎవరు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో అనేక ప్రాంతీయపార్టీలు ఉన్నాయి. అవి ఆయా రాష్ట్రాల్లో తమ మనుగడ కొనసాగిస్తున్నాయి. మరి కొత్తగా వచ్చే కేసిఆర్ పార్టీని ఆదరించేవారు ఎవరు?


రాష్ట్రాల వారీగా చూసుకుంటే తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటికే అధికారంలో ఉన్న డిఎంకే కాంగ్రెస్‌తో పొత్తులో ఉంది. అన్నాడిఎంకే సొంతపార్టీలోనే అనేక లుకలుకలు. ప్రస్తుతం ఆపార్టీ బీజేపీ జట్టులోనే ఉంది. కర్ణాటక విషయానికి వస్తే అధికారంలో బీజేపీ ఉంది. గతంలో అక్కడ కాంగ్రెస్- జేడిఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ ప్రస్తుతం అంత సత్సంబంధాలు ఇప్పుడు ఆ రెండు పార్టీలకు లేవు. సో జేడీఎస్ కేసిఆర్ మద్దతు పలికే ఛాన్స్ ఉంది. అయితే కేసిఆర్ పార్టీని కర్ణాటకలో ప్రారంభించడానికి కానీ, లేక వారు కర్ణాటకలో శాఖ ఏర్పాటు చేసుకోవడానికి జనతదళ్ (సెక్యులర్) పార్టీ నేతలు దేవగౌడ కానీ, ఆయన కుమారుడు కుమారస్వామి కానీ ఒప్పుకుంటారా? లేదనే చెప్పవచ్చు.


కేరళలో లెఫ్ట్ పార్టీల కూటమి అధికారంలో ఉంది. లెఫ్ట్ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నాయనీ, కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తోనే వెళ్తామని ఇప్పటికే చెప్పేశాయి. కేరళలో కూడా కేసిఆర్ పార్టీ శాఖలు ఏర్పాటు చేసుకోవడానికి కమ్యునిస్టులు ఒప‌్పుకుంటారా?


మహారాష్ట్రలో చూస్తే బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలైన శివసేన, ఎన్సీపీ ఇప్పటికే మహారాష్ట్రలో తమ తమ ఉనికిని చాటుకునేందుకు మరింత ప్రయత్నం చేస్తున్నాయి. మరి మహారాష్ట్రాలో కేసిఆర్ జాతీయపార్టీని ఆ రెండు పార్టీలు ఆహ్వానిస్తాయా? ప్రస్తుత పరిస్థితుల్లో లేదనే చెప్పుకోవాలి. ఇక ఒడిశాలో అక్కడ బీజూ జనతాదళ్ అధికారంలో వరుసగా కొనసాగుతూ వస్తుంది. నవీన్ పట్నయక్ కేసిఆర్ కు రెడ్ కార్పెట్ వేస్తారా? అనేది డౌటే. ఇక ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లోచూస్తే బీహార్‌లో ఆర్జేడీ, జేడియూ కలిసి ప్రభుత్వాన్ని తాజాగా ఏర్పాటు చేశాయి. ఇందులో కాంగ్రెస్ సహకారం కూడా ఉంది. వారు కాంగ్రెస్ తోనే ఉంటారు తప్ప కేసిఆర్ సపోర్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ. అక్కడ తాజాగా పాదయాత్ర చేపట్టిన ప్రశాంత్ కిషోర్ ఏమైనా సహకారం అందిస్తారేమో?


పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీ వేరే ఏ పార్టీ తన రాష్ట్రంలోకి రానిచ్చే పరిస్థితి లేదు. ఆమె దేశవ్యాప్తంగా చక్రం తిప్పాలని చూస్తున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏమాత్రం ఛాన్స్ ఇస్తుంది? ఇక ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తానే సొంతంగా అన్నీ రాష్ట్రాల్లో పుంజుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ రేపు గుజరాత్, రాబోయో రోజుల్లో గోవా, జార్ఖండ్ రాష్ట్రంలో పట్టు సాధించేందుకు ప్లాన్‌ చేస్తోంది. జార్ఖండ్‌లో జేఎఎం కాంగ్రెస్ మద్దతుతోనే అక్కడ కొనసాగుతోంది. సో కేసిఆర్‌కు నో ఛాన్స్.


కాశ్మీర్‌లో ఉన్నది జమ్ము అండ్ కాశ్మీర్ పీపుల్స్ డెమెక్రాటిక్ పార్టీ (PDP), కానీ జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరేన్స్ పార్టీలు కేసిఆర్ కు ఏమాత్రం మద్దతు తెలుపుతాయో తెలియని పరిస్థితి. ఇప్పటికే జమ్ము, కాశ్మీర్ రాష్ట్రం విడిపోయింది. అక్కడే డజన్లకొద్ది పార్టీలు ఉన్నాయి. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన గులామ్ నబీ అజాద్ కొత్త పార్టీ పెట్టారు. సో అయన కేసిఆర్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ఏ పార్టీ కూడా కేసిఆర్ పెట్టబోయే పార్టీని ఆహ్వానించే పరిస్థితి లేదు. 


తెలుగు మాట్లాడే తెలుగు రాష్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ లో కేసిఆర్ కొత్త పార్టీ శాఖ ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటారా? రాష్ట్రం విడిపోయి 8 ఏండ్లు కావస్తున్నా అనేక సమస్యలకు ఇంకా పరిష్కారమే లభించలేదు. సామరస్య పూర్వకమైన వాతావరణమే లేదు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీ వైసీపీ, టీడీపీ, జనసేన కేసిఆర్ పార్టీని రానిస్తాయా? అక్కడ మనుగుడ సాధిస్తుందా ఆ పార్టీ? అనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. ఇలా అనేక రాష్ట్రాల్లో చాలా హర్డిల్స్ ఉన్నప్పుడు కేసిఆర్ తో స్నేహానికి ఒకే కానీ కేసిఆర్ తమ రాష్ట్రంలో అడుగుపెడితే రానిచ్చేదెవరు? అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఒకప్పుడు ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీకి మేనకాగాంధీ పార్టీ సంయుక్త్ విచారణ మంచ్ (ఎస్ వి ఎం) చాలా కాలం పాటు మద్దతు తెలిపింది. 


ఇక కేసిఆర్ ఆల్ ఇండియా పార్టీ ఏం చేయబొతున్నది, దాని ఉద్దేశ్యం ఏమిటీ? ఏం చెప్పాలనుకుంటుంది? కాంగ్రెస్, బీజేపీలకు తమ పార్టీ ఎందుకు భిన్నం? అనే విషయాలను కేసిఆర్ క్లారిటీ ఇవ్వాలి. కేసిఆర్ తన పార్టీ ఎజెండా ఏమిటీ? ఎజెండాలో ఒక భాగం  రైతుల కోసమే అయితే దేశవ్యాప్తంగా రైతులకు ఏం చేయబోతున్నారు? తెలంగాణలో అమలౌతున్న రైతుబంధు లాంటి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పే అవకాశం ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సక్సెస్ రేట్ ఎంత అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది. ఇక్కడ కౌలు రైతులకు రైతు బంధు రాదు. మరి వివిధ రాష్ట్రాల్లో అధికంగా కౌలు రైతులే ఉన్నారు వారికి ఏం చెబుతారు? గిరిజనుల రిజర్వేషన్లపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కేసిఆర్ చెప్పే మాటలకు చేతలకు చాలా పొంతన తక్కువ అని కొందరు విమర్శిస్తున్నారు. 


ఇప్పటికే రైతు సంఘాలతో మాట్లాడిన కేసిఆర్ వారిని ఆయా రాష్ట్రాల్లో శాఖలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. 
కేసిఆర్‌తో స్నేహంగా ఉంటున్న మిగిలిన ప్రాంతీయ పార్టీలు కేసిఆర్ ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే పార్టీ నూతన శాఖల వల్ల తగాదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటి నుంచి పార్టీ విస్తరణకు పూనుకున్న 20029 నాటికే పూర్తిస్థాయిలో అన్నీ రాష్ట్రాల్లో పార్టీ విస్తరిస్తుంది తప్ప 2024 లోక్ సభ ఎన్నికలు సిద్ధం అయితే కాదని అనిపిస్తోంది. మరోవైపు కొత్త పార్టీని ఆయా రాష్ట్రాల్లో ప్రారంభించడానికి ముందుకు వచ్చే వారు ఎవరు? అనే దానికి కేసిఆరే సమాధానం చెప్పాలి. 


గులాబీ బాస్ సేఫ్ గేమ్ ఆడుతుంది ఇందుకేనా? 


దేశం సంగతి ఎలా ఉన్నా.. జాతీయపార్టీ పుంజుకుంటుందా? లేదా? అనేది పక్కన పెడితే తెలంగాణలో మాత్రం కేసిఆర్ తనకు తాను సేఫ్ అనుకుంటున్నట్లున్నారు. తాను లేవనెత్తున్న ఎజెండా కాంగ్రెసేతర, బీజేపీయేతర స్లాగన్ తెలంగాణలో బాగా వర్కౌవుట్ అవుతున్నట్లు ఉంది.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ పోరుతోనే సమతమౌతుంది. ఎంత లేవాలనుకున్నా ఆ పార్టీ లేవడంలేదు, మరోవైపు బీజేపీ పుంజకున్నా అధికారంలోకి వచ్చేంతగా పుంజులేదు. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీకి ఛాన్స్ తక్కువ ఉన్నాయనే అంచనాకు గులాబీ బాస్ వచ్చినట్లున్నారు. తెలంగాణలో ఇప్పటికే రెండుసార్లు అధికారంలో వచ్చిన గులాబీ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడానికి, సాంప్రదాయంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికే కేసిఆర్ జాతీయపార్టీ నినాదం ఎత్తుకున్నారనీ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.


జాతీయ రాజకీయాల్లోకి కేసిఆర్ వచ్చి చేసేది ఏమీ లేదని బీజేపీ విమర్శించినా, కేసిఆర్ మాత్రం తనకంటూ ఒక గోల్, దాన్ని సాధించడం కోసం ఆయన వేసే వ్యూహాలు, ఎత్తుగడలు ఆపార్టీలోని కొందరికే కాదు బయటి వారికి కూడా అర్థం కావు. రేపు జరగబోయే అసెంబ్లీలో ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఆయన ఏమైనా చేస్తారు. ఏ ప్రణాళికనైనా రచిస్తారు. ప్రణాళికలు రచించడం, వ్యూహాలు, ఎత్తుగడలో వేయడంలో తెలంగాణలో ప్రస్తుతం కేసిఆర్ సాటి ఎవరూ రారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కేసిఆర్ నూతన జాతీయపార్టీ విధివిధానాలు, పార్టీ స్వరూపం అంతా దసరారోజునే వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.