తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలకు వెళ్లిన ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన హ్యుండాయ్ గ్రూప్ పెట్టుబడి పెట్టేందుకు సముఖత వ్యక్తం చేసింది. 1,400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్టు పేర్కొంది. తెలంగాణ పెవీలియన్‌లో కేటీఆర్‌తో హ్యుండాయ్ సిఐఓ యంగ్చో చి మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్‌లో ఈ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. 


పెట్టుబడే కాదు అంతకు మించి


కేవలం పెట్టుబడి పెట్టడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండేందుకు హ్యుండాయ్ అంగీకరించింది. ఈ పెట్టుబడితో తమ కంపెనీ టెస్ట్ ట్రాక్‌లతోపాటు మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉన్న ఇతర అవకాశాలపైన కూడా విస్తృతంగా చర్చించారు. 


కేటీఆర్‌ కితాబు


తెలంగాణలో మొబిలిటీ రంగానికి హ్యుండాయ్ పెట్టుబడి గొప్ప బలాన్ని ఇస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో తొలిసారిగా ప్రత్యేకంగా ఒక మొబిలిటీ వ్యాలిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఇందులో భాగస్వామిగా ఉండేందుకు ముందుకు వచ్చిన హ్యుండాయ్‌కి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో 1400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన హ్యుండాయ్ కంపెనీకి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు కేటీఆర్. హ్యుండాయ్ రాకతో తెలంగాణ రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు మొబిలిటీ రంగంలో వస్తాయన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.


భారతదేశాభివృద్ధికి ఇన్నోవేషన్ రంగం బలోపేతమే ఉత్తమం 


దావోస్‌లో భారతదేశ ఇన్నోవేషన్ రంగంపై జరిగిన చర్చాగోష్టిలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. భారతదేశం స్టార్టప్ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించిన ప్రముఖ కంపెనీ స్థాపకులతో మంత్రి మాట్లాడారు. దేశంలో స్టార్టప్‌  ఎకో సిస్టమ్ బలోపేతానికి సంబంధించి తన అభిప్రాయాలు పంచుకున్నారు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి సాధించాలంటే దేశంలో ఇన్నోవేషన్ కల్చర్ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్నోవేషన్ అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానమే కాకుండా మానవ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి మొదలుకొని మున్సిపాలిటీ, గ్రామాల సమస్యలకు సైతం పరిష్కారాలు ఇవ్వగలిగే శక్తి ఉండాలన్నారు. ఇన్నోవేషన్ ద్వారా అద్భుతమైన వ్యాపార వాణిజ్య అవకాశాలతోపాటు సమాజం ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. అందుకే భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లను దాటుకొని వేగంగా ముందుకు పోవాలంటే ఇన్నోవేట్, ఇంకుబెట్, ఇంకర్పెట్ 3ఐ మంత్రమే మార్గం అన్నారు. హైదరాబాద్ నగరంలో ఇన్నోవేషన్ మరింతగా పెంచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఒక ఎనేబులర్‌గా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. 


ఫెయిల్‌ అవుతాయి కానీ..


తాము నమ్మిన ఆలోచనను పట్టుకొని తమ స్టార్ట్‌ప్ కోసం నిబద్ధతతో సంవత్సరాల తరబడి పని చేయడం ఒక అద్భుతమైన పని అని కేటీఆర్  అభిప్రాయపడ్డారు. స్టార్ట్‌ప్‌లలో 95శాతం విఫలమయ్యే అవకాశం ఉన్నా... నూతన ఆలోచనలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ప్రభుత్వం ఇన్నోవేషన్ రంగానికి నిరంతరం సహకారం అందిస్తూనే ఉండాలన్నారు. ఈ దిశగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇంకుబేటర్ టి హబ్ నిర్మాణంతోపాటు అనేక ఇతర కార్యక్రమాలు చేపట్టామన్నారు. తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ద్వారా బడి పిల్లల వయసు నుంచే ఇన్నోవేషన్ పైన అవగాహన కల్పించడం, టాలెంట్ ఉన్న విద్యార్థులకు సహకారం అందించే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్ రంగాన్ని బలోపేతం చేసేందుకు చేపట్టిన ప్రయత్నాలు, ఇప్పటికే ఫలితాలు ఇవ్వడం ప్రారంభమయ్యాయని, హైదరబాద్ కేంద్రంగా వేదికగా స్టార్ట్‌ప్స్ అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్ స్టార్టప్లకు రాజధానిగా మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.


హైదరాబాద్‌లో క్షయవ్యాధి నిర్ధారణ కిట్‌ల తయారీ కేంద్రం  


క్షయవ్యాధి (TB) డయాగ్నస్టిక్ కిట్‌లను తయారు చేసే గ్లోబల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని హైదారాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు EMPE డయాగ్నోస్టిక్స్ ప్రకటించింది. 25 కోట్ల పెట్టుబడితో జీనోమ్ వ్యాలీలో ప్రారంభించే కేంద్రంలో నెలకు 20 లక్షల టీబీ నిర్ధారణ కిట్‌లను తయారుచేస్తామని కంపెనీ ప్రకటించింది. 5 దేశాల్లో క్లినికల్ పరీక్షలు నిర్వహించి తరువాత హైదరాబాద్‌ను ఎంచుకున్నట్టు తెలిపింది. 


హైదరాబాద్‌లో తయారయ్యే కిట్‌లను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తారు. అదనంగా 50 కోట్ల పెట్టుబడితో 150 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను కంపెనీ కల్పించబోతుంది. మొత్తంగా రాబోయే కాలంలో హైదరాబాద్ కేంద్రంపై 25 మిలియన్ యూరోలను పెట్టుబడిగా పెట్టే ఆలోచనలో ఉన్నామని కంపెనీ ప్రకటించింది. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో మంత్రి కేటీఆర్‌తో EMPE డయాగ్నోస్టిక్స్ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ పవన్ అసలాపురం సమావేశం తరువాత తన నిర్ణయాన్ని కంపెనీ ప్రకటించింది. 


క్షయ ప్రభావిత 30 దేశాల్లో ఇండియా ఒకటన్నారు EMPE డయాగ్నోస్టిక్స్ డాక్టర్ పవన్ అసలాపురం. కోవిడ్ ప్రభావంతో టీబీ చికిత్స, నివారణ పురోగతిలో ప్రపంచం 10 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఇండియాలో టీబీ రోగులు ఎక్కువగా ఉన్నారన్న పవన్, యూరప్ దేశాల్లో అయితే చికిత్సకు లొంగని విధంగా టీబీ వ్యాధి పరిణామం చెందుతున్నారు. ఇప్పటికీ చాలా మంది వ్యాధి చికిత్సకు అవసరమైన యాంటీ బయాటిక్‌లను కాకుండా వేరే ఔషధాలను తీసుకుంటున్నారని చెప్పారు. ఫలితంగా టీబీ వ్యాప్తి క్రమంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో TBని గుర్తించి, సరైన యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం మునుపటి కంటే చాలా ముఖ్యమైనదన్నారు. ప్రపంచం మానవాళి ఎదుర్కుంటున్న ఈ ముప్పును తప్పించడానికి EMPE డయాగ్నోస్టిక్స్ పని చేస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని డాక్టర్ పవన్ అసలాపురం చెప్పారు. కిట్ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించిన మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. 


పురాతన అంటువ్యాధులలో క్షయ ఒకటన్నారు మంత్రి కేటీఆర్. వైద్య రంగానికి ఇప్పటికీ ఇది సవాల్‌గానే ఉందన్నారు. టీబీ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక భారాన్ని కలిగిస్తుందన్నారు. అయితే ఈ ముప్పును ఎదుర్కునేందుకు EMPE డయాగ్నోస్టిక్స్ ముందువరుసలో ఉండడం సంతోషకరమన్నారు. హైదరాబాద్ కేంద్రంగా టీబీ పై చేసే యుద్దానికి తమ సహకారం ఉంటుందన్నారు కేటీఆర్. 


హైదరాబాద్‌లో జిఎంఎం ఫాడులర్ విస్తరణ


ఫార్మా కంపెనీలకు అవసరమయ్యే గ్లాస్ రియాక్టర్, ట్యాంక్, కాలమ్‌లను తయారు చేసే జిఎంఎం ఫాడులర్(GMM Pfaudler ) హైదరాబాద్ తయారీ కేంద్రంపై అదనంగా 3.7 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతుంది. జిఎంఎం ఫాడులర్-ఇంటర్నేషనల్ బిజినెస్ సీఈవో- థామస్ కెహ్ల్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, దావోస్ డైరెక్టర్ అశోక్ జే పటేల్ మంత్రి కేటీఆర్‌తో సమావేశమై.. విస్తరణ ప్రణాళిక వివరించారు. తమ వ్యాపార ప్రణాళికల్లో హైదరాబాద్‌కే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టులోనూ భాగస్వామిగా ఉండడానికి జిఎంఎం ఫాడులర్ ఆసక్తిని వ్యక్తం చేసింది. 


గ్లాస్ లైనింగ్ పరికరాల ఉత్పత్తి కోసం రెండేళ్ల క్రితం (2020) 6.3 మిలియన్ డాలర్లతో  హైదరాబాద్‌లో జిఎంఎం ఫాడులర్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. అయితే అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి పెంచాలనుకున్న కంపెనీ మరో 37 లక్షలడాలర్లతో విస్తరణ ప్రణాళిక ప్రకటించింది. తాజా నిర్ణయంతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 300కు చేరుతుంది. అక్టోబర్ 2020- మార్చి 2022 మధ్య కాలంలో కంపెనీ హైదరబాద్ కేంద్రం 700 పరికరాలను వివిధ దేశాలకు ఎగుమతి చేసింది.


ఫార్మా రంగంలోని అపార అవకాశాల కోసం తాము ఇండియా వైపు చూస్తున్నామన్న జిఎంఎం ఫాడులర్ సీఈవో థామస్ కెహ్ల్, హైదరాబాదీ కేంద్రం ఇందులో కీలక పాత్ర పోషిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. వేగంగా విస్తరిస్తున్న ఫార్మా రంగంలో తమ పెట్టుబడులు కొనసాగుతాయన్నారు. పారిశ్రామిక అనుకూల విధానాలను అమలుచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఫార్మాపరిశ్రమలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటామని థామస్ కెహ్ల్ చెప్పారు. 


హైదరాబాద్ కేంద్రాన్ని విస్తరించాలనుకున్న జిఎంఎం ఫాడులర్ నిర్ణయం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ వృద్ధిలో భాగం కావాలనుకునే ఎవరికైనా తమ ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. ఫార్మా పరికరాల తయారీ రంగంలో నెంబర్ వన్‌గా ఎదగాలనుకుంటున్న జిఎంఎం ఫాడులర్ లక్ష్యాన్ని చేరడంలో హైదరబాద్ కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందన్న నమ్మకం తనుకు ఉందన్నారు కేటీఆర్.