Shamshabad Airport: గాలిలో ఉన్న విమానం ల్యాండింగ్ అవుతుండగా ఓ యువకుడు రెచ్చి పోయాడు. విమానం డోర్ (Flight Door) తీసేందుకు యత్నించి హల్ చల్ చేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ (Hyderabad Airport) వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) ల్యాండింగ్ అవుతుండగా విమానం తలుపు తెరిచేందుకు యత్నించాడు. అడ్డుకోబోయిన ఇతర ప్రయాణికులపై దాడి చేశాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారి ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. అందరు కలిసి యువకుడిని పట్టుకుని కూర్చోపెట్టారు. విమానం గాలిలో ఉండగా యువకుడు చేసిన పనికి తలుపులు తెరుచుకుని ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది.


పోలీసులకు అప్పగింత
విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయిన తరువాత ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అధికారులు యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. హల్ చల్ చేసిన యువకుడు కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలోని గాజులరామారం ప్రాంతానికి చెందిన అనిల్ పాటిల్‌గా గుర్తించారు. సదురు వ్యక్తి జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎయిర్ పోర్ట్ పోలీసులు జిమ్ ట్రైనర్‌కు నోటీసులు అందజేసి వివరణ కోరినట్లు సమాచారం. అలాగే కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడు ఎందుకు అలా ప్రవర్తించాడో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 


ప్రయాణికులను ఎక్కించుకోని విమానయాన సంస్థ
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంత‌ర్జాతీయ‌ విమానాశ్రయంలో మే నెల మొదటి వారంలో షాకింగ్‌ ఘ‌ట‌న ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ స‌ర్వర్ డౌన్ కావ‌డంతో సంస్థకు చెందిన విమానాలు ప్రయాణికుల‌ను ఎక్కించుకోకుండానే ఎయిర్‌పోర్టులోనే వ‌దిలేసి వెళ్లిపోయాయి. తమ సర్వర్ పనిచేయడం లేదని తమ జాబితాలో ప్రయాణికుల వివరాలు లేవని ప్రయాణికులను విమానంలో ఎక్కించుకునేందుకు సదరు సంస్థ నిరాకరించింది. దీంతో కొంద‌రు ప్రయాణికులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దెబ్బకు దిగొచ్చిన విమాన‌యాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. వేరే స‌ర్వీసుల్లో గ‌మ్యస్థానాల‌కు పంపించేందుకు అంగీకరించింది. దీనిపై ఎయిర్‌పోర్టు అధికారుల‌ను వివరణ కోరగా అసలు స‌మ‌స్య త‌మ దృష్టికి రాలేద‌ని చెప్పారు. స‌ర్వర్‌ను పున‌రుద్ధరించుకునే బాధ్యత సంబంధిత విమాన‌యాన సంస్థదేనని అధికారులు తేల్చి చెప్పేశారు.   


ఇటీవల గాలిలో ఊగిపోయిన విమానం
ఐదు రోజుల క్రితం సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం లండన్‌ నుంచి సింగపూర్‌ వెళ్తుండగా గాల్లో తీవ్రమైన కుదుపులకు గురైంది. లండన్‌లోని హెత్‌రో ఎయిర్‌పోర్ట్ నుంచి సింగపూర్ బయల్దేరిన బోయింగ్ 777-300ER విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికి మయన్మార్ గగనతలం సమీపంలో తుఫాను ప్రభావంతో కుదుపులకు లోనైంది. ఆకాశంలో 37,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా 6,000 అడుగులు పడిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు 211 మంది, సిబ్బంది 18 మంది కలిసి మొత్తం 229 మందితో విమానంలో ఉన్నారు. విమానం కుదుపులకు గురికావడంతో ఒక ప్రయాణికుడు మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. మేరకు మృతి చెందిన బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.