Hyderabad Crime News: హైదరాబాద్‌లోని ఓ యువకుడు బాలికను  ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో జైలు పాలయ్యాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కొడుకు పుట్టాడని బాలిక కబురు పెట్టింది. అంతే క్షణాల్లో వాలిపోయాడు. దాన్ని గమనించిన బాలిక ఫ్యామిలీ అతన్ని ఇంట్లో వేసి చితక్కొట్టారు. 


హైదరాబాద్‌లోని పాతబస్తీకు చెందిన పాతికేళ్లు అబ్దుల్​ సోహైల్‌కు అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమకు దారి తీసింది. పీకల్లోతు ప్రేమలో ఉన్న వీళ్లు పెద్దలను ఎదురించి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. 


మైనర్‌ను పెళ్లి చేసుకున్నందుకు సోహైల్‌పై పోక్సో చట్టం కింద కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు జైలుకు పంపించారు. 45 రోజుల పాటు జైల్లో గడిపిన సోహైల్‌ ఈ మధ్యే బెయిల్‌పై విడుదలయ్యాడు.సోహైల్ విడుదలైన సంగతి తెలుసుకున్న బాలిక కబురు పెట్టింది. మనకు బిడ్డ పుట్టాడని చూడటానికి రావా అంటూ ముద్దుగా పిలిచింది.  


ప్రియురాలు ముద్దుగా పిలిచిందని ఈ తెల్లవారు జామున ఆమె ఇంటికి వెళ్లాడు సోహైల్. ఈ విషయాన్ని సీసీ టీవీ కెమెరాల్లో చూసిన బాలిక తండ్రి ఇతర కుటుంబ సభ్యులు సోహైల్‌ను పట్టుకునే ప్రయత్నం చేశారు. వారి నుంచి తప్పించుకొని వేరే గదిలోకి వెళ్లి దాక్కున్నాడు. ఎవరూ అటు రాకుండా తలుపులు వేసేసాడు. 
తప్పించుకునే క్రమంలో బాలిక తండ్రికి చిక్కి తన్నులు కూడా తిన్నాడు. దొరికితే చంపేస్తారని భయపడి గదిలో దాక్కున్న సోహైల్‌  అక్కడే ఓ వీడియోను తీసి స్నేహితులకు పంపించాడు.తాను ప్రియురాలి ఇంట్లో ఇరుక్కుపోయానని తనను చంపేందుకు వారి బంధువులు కాచుకొని ఉన్నారని రక్షించాలని వేడుకున్నాడు. 


ఆ వీడియో కాస్త పోలీసులకు చేరింది. వెంటనే అలర్ట్ అయిన బండ్లగూడ పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చారు. గదిలో దాక్కున్న సోహైల్‌ను విడిపించి తీసుకెళ్లారు. 
యువతితో ఆమె పేరెంట్సే బలవంతంగా ఫోన్ చేయించారని... జైలు నుంచి వచ్చినప్పటి నుంచి రోజూ ఫోన్ చేయిస్తున్నారని సోహైల్ బంధువులు ఆరోపిస్తున్నారు. చంపేందుకే కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.