సింగరేణి ప్రాంతంలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ విప్, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో సింగరేణి ప్రాంత సమస్యలపై ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్, మందమర్రి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం కావలసిన సింగరేణి భూములు రెవిన్యూ శాఖకు అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఇప్పటికే సింగరేణి రెవెన్యూకి అప్పగించిన భూములలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, మహిళా భవన్, బతుకమ్మ గ్రౌండ్స్, కమ్యూనిటీ భవనాలు తదితర నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు.
త్వరలోనే ఐదో విడత ఇండ్ల పట్టాల పంపిణీ
జీవో 76 ద్వారా రామకృష్ణాపూర్ లో ఇప్పటివరకు 1972 మందికి సింగరేణి ఇండ్ల పట్టాల పంపిణీ చేసినట్టు గుర్తు చేశారు. త్వరలోనే ఐదో విడత ఇండ్ల పట్టాల పంపిణీ ఉంటుందని బాల్క సుమన్ వెల్లడించారు. బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాలలో ఉన్న 8,252 క్వార్టర్లలో సింగరేణి అవసరాలకు, కార్మికులకు సరిపడా కేటాయించగా మిగిలినవి నిరుపేదలకు అందించడానికి సహకరించాలని కోరారు. క్వార్టర్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యత రిటైర్డ్ సింగరేణి కార్మికులకే ఉంటుందని ప్రత్యేకంగా సూచించారు. ఈ విషయమై కార్మికులు ఎలాంటి వదంతులు నమ్మొద్దని సూచించారు.




సింగరేణి, మున్సిపల్ అధికారులు సమన్వయం
శిథిలావస్థలో ఉన్న సింగరేణి క్వార్టర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఇప్పటికే పాడుబడ్డ క్వార్టర్స్ లో అసాంఘిక కార్యకలాపాలతో పాటు, విష సర్పాలకు, జంతువులకు ఆవాసంగా మారి ప్రజలకు ఇబ్బంది అవుతుందని తెలిపారు. సింగరేణి ఏరియాలలో శానిటేషన్ వ్యవస్థ మరింత మెరుగుపరుచుకోవాలని సింగరేణి అధికారులకు సూచించారు. సింగరేణి, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పని చేసుకోవాలన్నారు. సింగరేణి ఏరియాలలో నివాసముండే కార్మికేతర కుటుంబాలకు తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి విషయాల్లో మానవతాదృక్పథంతో చూడాలని కోరారు. సింగరేణ ఏరియాలలో అదనంగా పార్కులు, చిల్డ్రన్స్ ప్లేగ్రౌండ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. 


మున్సిపల్, అధికారులు సింగరేణి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం ద్వారా ప్రజలకు మరింత సేవలు అందించడానికి దోహదపడుతుందని చెప్పారు. అవసరానికి తగ్గట్టుగా ఒకరికొకరు సమన్వయంతో పనిచేయడం వల్ల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవడానికి ఆస్కారం ఉంటుందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్ బలరాం నాయక్, శ్రీరాంపూర్ ఏరియా జీఎం సంజీవరెడ్డి, మందమర్రి, రామకృష్ణాపూర్ మున్సిపల్ కమిషనర్లు రాజు, వెంకటనారాయణ, మందమర్రి తహసిల్దార్ శ్రీనివాస్, మందమర్రి ఏరియా జిఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


దేశంలోనే మొదటి సారిగా సింగరేణి సహకారంతో ఆర్టీసీ టూరిజం ప్యాకేజీ సిద్దం చేస్తోంది. ఇటీవల రామగుండంకు వచ్చిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీ-2 ఏరియాలోని వాకీల్ పల్లి గనిని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. బొగ్గు గనులు ఇక్కడి ప్రాజెక్టులతో కలిపి ఆర్టీసీ టూరిజం ప్యాకేజీ చేస్తే బాగుంటుందని ప్రకటించిన ఆయన ప్యాకేజీకి సహకరించాలని సింగరేణికి లేఖ రాశారు. సింగరేణి బొగ్గు గని ఓసీపీ పవర్ ప్లాంట్ తో పాటు రాబోయే రోజుల్లో పార్వతీ బ్యారేజీ కాళేశ్వరంలోని ముక్తేశ్వరాలయం, కాలేశ్వరం ప్రాజెక్టు వంటి పర్యాటక స్థలాలను పొందుపరచనున్నట్లు చెప్పారు. ఈ మేరకు సీఎండి శ్రీధర్ కు లేఖ రాయడంతో టూరిజం ప్యాకేజీ పనుల్లో వేగం పెరిగింది. హైదరాబాద్ బస్సు భవన్ నుంచి ముగ్గురు, కొత్తగూడెం సింగరేణి కార్పోరేట్ కార్యాలయం నుంచి ముగ్గురు అధికారులు వచ్చి పర్యాటక గని ఓసీపీ 3 ప్లాస్టింగ్ చూపించే ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.