Minister KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. ఎవరైనా తమ సమస్యను చెబితే వెంటనే స్పందిస్తూ వారికి సాయం అందించడంలో ముందుంటారు. ఇదే కాకుండా సమకాలీన విషయాలపై కూడా కేటీఆర్ తరచూ ట్విట్లు చేస్తుంటారు. తాజాగా ఆయన ఓ ట్వీట్ చేశారు. తమ పూర్వీకులకు సంబంధించిన ఇంటి వద్ద ఉన్న ఫొటోను కేటీఆర్ ట్వీట్ చేశారు. 






"కామారెడ్డి జిల్లాలోని పోసానిపల్లి గ్రామం (ప్రస్తుతం కోనాపూర్) మా అమ్మమ్మ పూర్వీకుల ఇల్లు ఇది. ఎగువ మానేర్ ప్రాజెక్ట్‌ కారణంగా.. 1940లలో ఈ గ్రామంలో భూములు మునిగిపోయాయి. అయితే ఇంటి అవశేషాలు మాత్రం నేటికీ మిగిలిఉన్నాయి. మా అమ్మమ్మ జ్ఞాపకార్థం పాఠశాల నిర్మించడానికి ఈ గ్రామాన్ని సందర్శించాను"  అని కేటీఆర్ ట్వీట్ చేశారు. 


ట్విట్టర్ లో సూపర్ యాక్టీవ్ 


సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో చాలా యాక్టీవ్ గా ఉంటారు మంత్రి కేటీఆర్. ట్విట్టర్ వేదికగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి కావాల్సిన సాయం చేస్తూ ఉంటారు. ప్రజల సమస్యలు తీర్చడమే కాదు ఆయన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. తాజాగా కేటీఆర్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆ ట్వీట్ కింద కామెంట్లు మాత్రం అత్యధికం ప్రజలు తమ సమస్యలు చెప్పడానికే ఉపయోగించారు. అంటే.. కేటీఆర్ ట్విట్టర్ ను సమస్యల పరిష్కారానికి ఓ సాధనంగా ఉపయోగించుకుంటున్నారన్నమాట. 


ట్విట్టర్ ద్వారా అనేక మంది సమస్యలు పరిష్కరిస్తున్న కేటీఆర్


మంత్రి కేటీఆర్  ప్రజలకు దగ్గరగా ఉండటానికి ట్విట్టర్‌ను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన తన పర్సనల్ ట్విట్టర్  @KTRTRS హ్యాండిల్‌తో పాటు @KTRoffice ఆఫీస్ ఆఫ్ కేటీఆర్ హ్యాండిల్‌ను కూడా తన టీంతో మెయిన్‌టెయిన్ చేస్తూంటారు. తన అధికారిక మంత్రిత్వశాఖ హ్యాండిల్ ఎలాగూ ఉంటుంది. వీటన్నింటికీ ఆయనకు పెద్ద ఎత్తున రిక్వెస్టులు వస్తూ ఉంటాయి. చాలా వరకూ రియల్‌గా అవసరం .. సాయం కోసం ఎదురు చూస్తున్న వారిని గుర్తించి.. వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని .. తన ఆఫీసుకు రిఫర్ చేస్తూంటారు కేటీఆర్. దీని వల్ల అనేక వందల మందికి సాయం అందింది. కేటీఆర్ ఇలా వేగంగా స్పందిస్తూడటంతో ఆయనకు రిక్వెస్టులు పెట్టే వారు కూడా అంతకంతకూ పెరుగుతున్నారు.