Medchal News: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సమీపంలోని సూరారంలో ఓ షాపు ఓనర్ వినూత్న ఆఫర్ ప్రకటించాడు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి.. పోలింగ్ శాతాన్ని పెంచాలని ఉద్దేశంతో తనదైన శైలిలో ఆఫర్ ప్రకటించాడు. పర్యావరణ ప్రేమికుడైన రవీందర్ ముదిరాజ్ ఒక వినూతన కార్యక్రమాన్ని చేపట్టాడు. తన వద్ద కూరగాయలు కొంటే ఓటు వేసిన వారు రాయితీ పొందవచ్చని ప్రకటించాడు.


రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ 13వ తారీకున ఎన్నికల్లో  ఓటు వేసిన వారు తమ చూపుడువేలు చూపించి ఎన్నికల కార్డుతో పాటు తమ దుకాణానికి వస్తే కూరగాయలు 10 శాతం డిస్కౌంట్ తో ఇస్తామని చెప్పాడు. జిరాక్స్ లు తీసుకున్నా కూడా డిస్కౌంట్ వర్తిస్తుందని.. జిరాక్సులపై 25 శాతం తక్కువ ఛార్జీ తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు  మిగత దుకాణదారులు, షాపింగ్ మాల్స్ కూడా ప్రవేశపెట్టాలని రవీందర్ ముదిరాజ్ కోరాడు. పెట్రోల్ పంపు వారు కూడా ఇలాంటి ఆఫర్ ప్రకటిస్తే ఓటు శాతం భారీగా పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ఓటు వేయని వారిని ఐటీ కంపెనీలు వివిధ ప్రైవేట్ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వారి వారి యజమానులు బోనస్ అగ్రిమెంట్లు సెలవులు ఇవ్వబోమని హెచ్చరించాలని పిలుపు ఇచ్చాడు. ఓటు వినియోగించుకొనేలా వివిధ సంస్థలు కూడా చర్యలు చేపట్టాలని రవీందర్ కోరాడు.