గుర్తు తెలియని వ్యక్తులు గంధపు చెట్లను నరికి, దుంగలుగా చేసి ఎత్తుకెళ్లిన ఘటన హైదరాబాద్ పాతబస్తీ నెహ్రూ జూలాజికల్ పార్కులో చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం నెహ్రూ జూలాజికల్​ పార్కులో గుర్తు తెలియని వ్యక్తులు  ఏడు గంధపు చెట్లు నరికివేసి ఎత్తుకెళ్లిన ఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


ఏడు గంధపు చెట్లను నరికి చిన్న చిన్న దుంగలుగా చేసి అందులోని కొన్ని దుంగలు ఎత్తుకెళ్లిపోగా కొన్ని ఘటన స్థలం సమీపంలో దొరికాయి. నెహ్రూ జూలాజికల్​ పార్కులో వన్య ప్రాణులతో పాటు ఖరీదైన గంధపు చెట్లు ఉన్నాయి. ఈ నెల 20వ తేదీన జూ అధికారులు ఏడు గంధపు చెట్లను నరికినట్లు గుర్తించారు. అందులో కొన్ని దుంగలను మాత్రమే జూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని జూ అధికారులు ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు. జూ అధికారులు బహదూర్ పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు.


గంధం చెట్లు దొంగతనాలకు గురవుతున్న నేపథ్యంలో జూపార్కులో పరిసరాలలో అదనంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, మరింత భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రిన్సిపల్​ చీఫ్​ కన్జర్వేటర్​ ఆఫ్​ ఫారెస్ట్​ (పీసీసీఎఫ్​) లోకేష్​ జై స్వాల్​ జూ అధికారులను ఆదేశించారు. 


రెండు రోజుల క్రితం జూ పార్కులో ఏడు గంధపు చెట్లను నరికి వేసిన ప్రాంతాన్ని శనివారం ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం జూపార్కులో జూ అధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని క్యూరేటర్​కు సూచించారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో పాటు  సెక్యూరిటీని కూడా నియమించాలన్నారు. జూ చుట్టూ ఎలక్ట్రికల్​ ఫెన్సింగ్​ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం జూపార్కులో జంతువుల సంరక్షణ , వారి ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. 


ఈ సమావేశంలో జూ పార్కు డైరెక్టర్​ వినయ్ కుమార్​, క్యూరేటర్​ ప్రశాంత్​ బాజిరావు పాటిల్​ తో పాటు జూ అధికారులు పాల్గొన్నారు. గతంలో కూడా జూ పార్కులో గంధపు చెట్లు ఇలానే గుర్తు తెలియని వ్యక్తులు నరికి తీసుకెళ్లిన ఘటనలు వెలుగు చూశాయి.