Hyderabad News: 2023 జులైలో హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ మార్కెట్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది. భాగ్యనగరంలో ఈ నెలలోనే 5,557 రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసింది. ఈ ఏడాది 26 శాతం పెరుగుదల ఉండగా... నమోదైన ఆస్తుల మొత్తం విలువ రూ. 2,878 కోట్లకు చేరుకుంది. ఇది 35 శాతం వార్షిక వృద్ధిని సూచిస్తుంది. హైదరాబాద్ నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్ నాలుగు జిల్లాల్లో చాలా ఎక్కువగా ఉంది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో... జులై 2023లో హైదరాబాద్‌లో మెజారిటీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌లు రూ. 25 నుంచి 50 లక్షల ధర పరిధిలోకి వచ్చాయి. ఇది మొత్తం రిజిస్ట్రేషన్‌లలో 52 శాతం. రూ. 25 లక్షల లోపు ధర కలిగిన ఆస్తులు 18 శాతం రిజిస్ట్రేషన్‌లుగా ఉన్నాయి. రూ. 1 కోటి మరియు అంతకంటే ఎక్కువ టిక్కెట్ పరిమాణాలతో అధిక - విలువ ప్రాపర్టీ విక్రయాలు, జులై 2023లో 9 శాతం రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. జులై 2022 గణాంకాలతో పోల్చితే కొంచెం ఎక్కువ.


జులై 2023లో ప్రాపర్టీలకు డిమాండ్ వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల పరిధిలోనే కేంద్రీకృతమై ఉంది. ఇది మొత్తం రిజిస్ట్రేషన్‌లలో 67 శాతం. చిన్న గృహాలకు (500-1,000 చదరపు అడుగులు) డిమాండ్ కూడా బాగా పెరిగింది. జులై 2022లో 17 శాతం ఉన్న ఈ కేటగిరీ రిజిస్ట్రేషన్‌లు జూలై 2023లో 18 శాతానికి పెరిగాయి. 2000 చదరపు అడుగుల కంటే పెద్ద ప్రాపర్టీలు కూడా డిమాండ్‌లో పెరిగాయి. రిజిస్ట్రేషన్లు జూలై 2022లో 9 శాతం నుంచి 2023 జులైలో 11 శాతానికి పెరిగాయి. జిల్లా స్థాయిలో మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో 46 శాతం ఇళ్ల విక్రయాలు జరగ్గా, రంగారెడ్డి జిల్లాలో 37 శాతం నమోదైందని అధ్యయనం వెల్లడించింది. జులై 2023లో మొత్తం రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వాటా 17 శాతం. జులై 2023లో హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ అమ్మకాలు ప్రధానంగా 1000-2000 చదరపు అడుగుల మేరలో ఉండగా.. ధరల శ్రేణి రూ. 25 నుండి 50 లక్షల వరకు అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్‌లు అయ్యాయి. అయినప్పటికీ.. భారీ లావాదేవీలతో పాటు గృహ కొనుగోలుదారులు పెద్ద పరిమాణాలు, మెరుగైన సౌకర్యాలతో పెట్టుబడులు పెట్టారు. వీటిలో కొన్ని ప్రీమియం డీల్‌లు హైదరాబాద్ మరియు రంగారెడ్డి వంటి మార్కెట్‌లలో జరిగాయి. ఇక్కడ ఆస్తులు 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. వాటి విలువ రూ. 5 కోట్ల కంటే ఎక్కువ.


విలాసవంతమైన ఇళ్ల కొనుగోలులోనూ హైదరాబాదే టాప్


హైదరాబాద్ లో ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. కరోనా అనంతరం ప్రజలంతా విలాసవంతమైన ఇళ్లు కొనుక్కునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇళ్ల, ఫ్లాట్ల ధరల పెరుగుదల దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ లో అధికంగా ఉంది. మధ్యశ్రేణి, ప్రీమియం విభాగాల్లో ఇళ్ల ధరల పెరుగుదల 23 శాతంగా ఉండగా.. విలాసవంతమైన గృహాల సగటు ధరలు (1.5 కోట్లకుపైగా సెగ్మెంట్) 42% శాతం పెరిగాయని తెలుస్తోంది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో రూ.1.5 కోట్లకు మించి ధర ఉన్న విలాసవంతమైన ఇళ్ల ధరలు గత ఐదేళ్లలో సగటున 24 శాతం పెరిగాయని స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ వెల్లడించింది. 40 లక్షల లోపు ఇళ్లు, ఫ్లాట్ ధరలు 15 శాతం పెరిగాయని చెప్పింది. అలాగే 40 లక్షల రూపాయల నుంచి రూ.1.5 కోట్ల వరకు ఉన్న మధ్యశ్రేణి ప్రీమియం విభాగాల్లో ధరల పెరుగుదల సగటున 18 శాతం ఉందని తెలిపింది. 2018లో ఏడు నగరాల్లో విలాసవంతమైన ఇళ్ల ధర చదరపు అడుగుకు సగటు రూ.12,400గా ఉందని.. ఇప్పుడు రూ.15,350కి పెరిగిందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో సంస్థ పేర్కొంది.