Minister KTR: హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో చదువుకున్నందుకు తనకు చాలా గర్వంగా ఉంటుందని.. విదేశాలకు వెళ్లినప్పుడు నిజాం కాలేజీలో చదువుకున్నట్లు గొప్పగా చెబుతానని మంత్రి కేటీఆర్ అన్నారు. 1993 నుంచి 96 వరకు నిజాం కాలేజీలో చదువుకున్నట్లు చెప్పుకొచ్చారు. నిజాం కాలేజీ పరిసరాలకు వచ్చిన ప్రతిసారీ విద్యార్థి జీవిత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయన్నారు. నిజాం కాలేజీకి గొప్ప పేరు ఉందని అన్నారు. నిజాం కాలేజీలో బాయ్స్ హాస్టల్, న్యూ కాలేజీ బ్లాక్ కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం నిజాం కాలేజీ గురించి, విద్యార్థి దశలో తన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. విశ్వవిద్యాలయాల పరంగా తెలంగాణకు 4వ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఓయూ ఉపకులపతి రవీందర్ కూడా ఉస్మానియా వర్సిటీ అభివృద్ధి కోసం మంచి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 


పూర్వ విద్యార్థుల సాయం కార్యక్రమం భేష్


విశ్వవిద్యాలయ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేసేలా ప్రారంభించిన కార్యక్రమం బాగుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ టీశాట్ తో కలిసి ఉస్మానియా టీవీ ఏర్పాటు చేయడం మంచి ఆలోచనగా ప్రశంసించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విద్యను మరింత మందికి చేరువ చేసేలా ప్రయత్నం చేయడం హర్షించదగిన విషయంగా చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వనని గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. నిజాం కాలేజీకి ఎలాంటి నిధులు ఇవ్వలేదని విమర్శలు చేశారు. పూర్వ విద్యార్థి అయి ఉండి కూడా కిరణ్ కుమార్ రెడ్డి నిజాం కాలేజీకి నిధులు ఇవ్వలేదన్నారు. గతంలో ఈ కళాశాలలో డిగ్రీ చదువుతున్న బాలికలకు హాస్టల్ లేకపోవడంతో.. దానిని వెంటనే నిర్మించుకుని  ప్రారంభించుకున్నట్లు తెలిపారు.


Also Read: చిరుత దాడిలోనే చిన్నారి లక్షిత మృతి- పోస్టుమార్టం రిపోర్టుతో డౌట్స్ క్లియర్


విద్యాశాఖకు అదనపు నిధులు


గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థులకు వసతి సౌకర్యం ఉండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. విద్యాశాఖకు కేటాయించిన నిధులకు అదనంగా.. పురపాలక శాఖలోని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోని రూ. 40.75 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు బాయ్స్ హాస్టల్ తో పాటు అదనపు తరగతి గదులను నిర్మించుకోనున్నట్లు తెలిపారు. వచ్చే 15 నెలల్లో భవనాల నిర్మాణాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాలేజీ గ్రౌండ్ కు ఇబ్బంది రాకుండా నిర్మాణాలు చేపట్టాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. భవన నిర్మాణాల కోసం విద్యాశాఖకు కేటాయించిన నిధులతో పాటు అదనంగా హెచ్ఎండీఏ నిధులు కూడా ఇచ్చినందుకు మంత్రి కేటీఆర్ కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. తొలిసారిగా నిజాం కాలేజీ డిగ్రీ విద్యార్థులకు కూడా హాస్టల్ వసతి కల్పించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ విద్యాశాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించారని, వర్సిటీల కోసం 500 కోట్లు కేటాయించారని వెల్లడించారు. గురుకులాల్లో అమ్మాయిల సంఖ్య పెరిగిందని అన్నారు. కల్యాణ లక్ష్మీ డబ్బులను కొంత మంది అమ్మాయిలు ఉన్నత చదువుల కోసం వాడుకుంటున్నారని తెలిపారు.