Hyderabad Police: తెలుగు రాష్ట్రాల్లో గణేష్‌ చవిత హడవుడి మొదలైపోయింది. భారీ స్థాయిలో పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమకు నచ్చిన విగ్రహాలు తీర్చిదిద్దే పనిలో కొందరు ఉంటే... విగ్రహాలకు అడ్వాన్స్‌లు ఇచ్చిన వారు మరికొందరు. దీంతో చవితికి ఇంకా రెండు వారాలు టైం ఉండగానే కోలాహలం మొదలైపోయింది. 


ఏ ప్రాంతంలో ఎన్ని విగ్రహాలు పెట్టినా, ఎంత గ్రాండ్‌గా చేసిన హైదరాబాద్‌లో సందడే వేరు. ఇక్కడ ఆగస్టు మొదటి వారం నుంచే వినాయక చవితి హంగామా మొదలైపోతుంది. ప్రతి కాలనీలో మండలపాలు ఏర్పాటు చేసేందుకు పూజాకమిటీలు రెడీ అవుతుంటాయి. ఈ ఏడాది కూడా అలాంటి సందడి వాతావరణం అంతటా కనిపిస్తుంది.


హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక మండపాల నిర్వాహకులకు మాత్రం పోలీసులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇవి పాటించకుంటే కచ్చితంగా సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. ముందుగా మండపాలన ఏర్పాటుకు సంబంధించి ఆయా పోలీస్‌స్టేషన్‌లో అనుమతులు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆగస్టు 27స నుంచి సెప్టెంబర్‌ 6 వరకు అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. అప్పుడు పోలీసులు చెప్పే రూల్స్ కచ్చితంగా పాటించాలని చెబుతున్నారు. 


పూజాకమిటీలందరూ ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా దరఖాస్తు చేసుకొని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో విగ్రహం ఎక్కడ పెడుతున్నారు. ఎన్ని రోజులు పూజలు చేస్తారు. ఎప్పుడు నిమజ్జనం చేస్తారు శోభాయాత్ర చేసే రూట్ ఇవ్వాల్సి ఉంటుంది. 


కొందరు విగ్రహాలను సొంత స్థలంలోనే కాకుండా వేర్వేరు స్థలాల్లో పెడుతుంటారు. అందుకే కచ్చితంగా ఆ స్థలం యజమానిక అనుమతి తెలియజేసే పత్రాన్ని జత చేయాల్సి ఉంటుంది. వివాదాల్లో ఉన్న స్థలాల్లో విగ్రహాలు పెట్టొద్దని పోలీసులు సూచిస్తున్నారు. 


శోభాయాత్ర టైంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా కార్యక్రమం నిర్వహిస్తామని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. మండపాలకు అధికారి విద్యుత్ వినియోగం ఉండాలి. దీని కోసం పోలీసులు, విద్యుత్ శాఖ నుంచి క్లియరెన్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ జరిగే నిర్లక్ష్యానికి పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులదేనంటూపోలీసులు చెబుతున్నారు. 


కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే లౌడ్‌స్పీకర్లకు అనుమతి ఉంటుంది. ఇది కూడా మండపం వద్ద రెండు బాక్స్‌లకు మాత్రమే అనుమతి ఇస్తారు. 


గణేష్‌ మండపంలో వలంటీర్లను నిర్వహకులు ఏర్పాటు చేసుకోవాలి. వారికి ఐడీ కార్డులు, బ్యాడ్జీలు ఇవ్వాలి. పోలీసులు తనిఖీలు చేసేటప్పుడు మండలం అనుమతి పత్రాలు, ఇతర వివరాలు అందజేస్తూ ఉండాలి. అపార్ట్‌మెంట్లు, సెల్లార్లలో విగ్రహాలు పెట్టుకున్న వాళ్లు ఊరేగింపు కోసం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం 8712665785 నెంబర్‌కు కాల్ చేయొచ్చు.