హైదరాబాద్‌లో నేటి నుంచి (డిసెంబరు 26) వచ్చే 5 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతకాల విడిదికి హైదరాబాద్‌కు వస్తున్నందున నేటి నుంచి నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రయాణికులు సహకరించాలని సీపీ కోరారు. 


వచ్చే 5 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
సోమవారం (డిసెంబరు 26) మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు సోమాజిగూడ - హకీంపేట నుంచి మార్గంలోని తిరుమలగిరి, కార్ఖానా, సికింద్రాబాద్‌ క్లబ్, టివోలీ, ప్లాజా, బేగంపేట, రాజ్‌భవన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి.


మంగళవారం (డిసెంబరు 27) ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హకీంపేట, తిరుమలగిరి, కార్ఖానా, సికింద్రాబాద్‌  క్లబ్, టివోలీ ప్లాజా, సీఈఓ, ప్యారడైజ్, రాణీగంజ్, కర్బలా, ట్యాంక్‌బండ్, లిబర్టీ, హిమాయత్‌నగర్‌ వై జంక్షన్, నారాయణగూడ ఎక్స్‌ రోడ్డు, వైఎంసీఏ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. 


బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌ నుంచి నారాయణగూడలోని కేశవ మెమోరియల్‌ విద్యాసంస్థలకు సరిగ్గా మంగళవారం ఉదయం 10.20 గంటలకు ఆమె వెళ్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం ఆమెకు ఘనంగా స్వాగతం పలకనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉదయం 10.20 గంటలకు కాలేజీకి వచ్చి ఇక్కడ జరిగే సదస్సులో గంటకు పైగా ఉండనున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ‘నైజాం నుంచి హైదరాబాద్‌ విముక్తి’ అనే అంశంపై జరిగే సదస్సులో రాష్ట్రపతి పాల్గొననున్నారు. కేశవ్‌ మెమోరియల్‌ విద్యాసంస్థలకు 2014లో దేశ ప్రధాని అభ్యర్థిగా.. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ వచ్చారు. ఇప్పుడు రాష్ట్రపతి రానున్నారు.


డిసెంబరు 27న..
డిసెంబరు 27 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు హకీంపేట - తిరుమలగిరి - కార్ఖానా - సికింద్రాబాద్‌ క్లబ్‌ - టివోలీ ప్లాజా, సీటీఓ - బేగంపేట - ఎన్‌ఎఫ్‌సీఎల్‌– బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1/10 జంక్షన్, మాసాబ్‌ట్యాంక్, సరోజినీదేవి ఐ హాస్పిటల్, పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఆరాంఘర్, కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి – బండ్లగూడ, చాంద్రాయణ గుట్ట, పిసల్‌బండ/చార్మినార్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి.


ఎయిర్ ఫోర్టుకు వెళ్లేవారు దారి మళ్లాల్సిందే
ఈ మార్గంలో ఎయిర్‌ పోర్టుకు వెళ్లే వారు బాలాపూర్‌ లేదా ఐఎస్‌ సదన్, నల్గొండ ఎక్స్‌ రోడ్డు మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. 


డిసెంబరు 28న..
బుధవారం (డిసెంబరు 28) ఉదయం 7 నుంచి 9 గంటల వరకు హకీంపేట - అల్వాల్, లోతుకుంట మార్గంలో మాత్రమే ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి. తిరుమలగిరి నుంచి శామీర్‌పేట వెళ్లే ట్రాఫిక్‌ను బోయిన్‌పల్లి సుచిత్ర మీదుగా బాలాజీనగర్‌– అమ్ముగూడ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను లాల్‌బజార్, కేవీ జంక్షన్‌ వైపునకు మళ్లిస్తారు. 


డిసెంబరు 29న..
గురువారం (డిసెంబరు 29) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ బొల్లారం – షేక్‌పేట మార్గంలోని లోతుకుంట వై జంక్షన్, లాల్‌బజార్, తిరుమలగిరి, కార్ఖానా, సికింద్రాబాద్‌ క్లబ్, టివోలీ, ప్లాజా, బగేంపేట, పంజగుట్ట, ఎస్‌ఎన్‌టీ జంక్షన్, ఫిల్మ్‌నగర్‌ (బీవీబీ), షేక్‌పేట, ఓయాసిస్‌ స్కూల్‌ టోలీ చౌకీ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి.   


అదే రోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శంషాబాద్‌ - బొల్లారం మార్గంలోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే – ఎన్‌ఎండీసీ– మాసాబ్‌ట్యాంక్‌– బంజారాహిల్స్‌ 1/12 జంక్షన్‌ – రోడ్‌ నెంబర్‌ 1/10, తాజ్‌కృష్ణ– జీవీకే– ఎన్‌ఎఫ్‌సీఎల్, పంజాగుట్ట ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట ఫ్లైఓవర్, రసూల్‌పురా, సీటీఓ ఫ్లైఓవర్, ప్లాజా, టివోలీ, సికింద్రాబాద్‌ క్లబ్, కార్ఖానా– తిరుమలగిరి– లోతుకుంట మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. 


శుక్రవారం (డిసెంబరు 30) ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు సోమాజిగూడ – బొల్లారం మార్గంలోని సోమాజిగూడ, రాజ్‌భవన్‌ రోడ్డు, బేగంపేట– ప్లాజా– టివోలీ– సికింద్రాబాద్‌ క్లబ్‌– కార్ఖానా– తిరుమలగిరి– లోతుకుంట మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి.