Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. రైలు దిగాక మీ ప్రాంతానికి వెళ్లాలంటే ఇకపై మరింత మెరుగైన సౌకర్యం అందుబాటులోకి రానుంది. లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా ఓ కంపెనీ ఈ-ఆటోలను అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మెట్రో రైడ్ అనే సంస్థ మెట్రో స్టేషన్ల నుంచి లాస్ట్ మైల్ నుంచి వివిధ ప్రాంతాలకు ఈ-ఆటోలను నడపనుంది. దీంతో ఇక మెట్రో రైలు దిగగానే గమ్యస్థానానికి చేరుకునేందుకు ప్రయాణికులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండబోదు. మెట్రో దిగగానే ఎలక్ట్రిక్‌ ఆటోలు ఈ - ఆటోలు సిద్ధంగా ఉంటాయి. ప్రత్యేకించి మెట్రో రైలు స్టేషన్ల నుంచే వివిధ ప్రాంతాలకు ఈ ఆటోలు తిరుగుతాయి.


మెట్రో రైడ్ (Metro Raid) అనే స్టార్టప్ సంస్థ ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఈ సేవలను అందిస్తోంది. అక్కడ ఇది విజయవంతంగా అమలు అవుతోంది. ఈ మెట్రో రైడ్ సంస్థ ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా తన కార్యకలాపాలను ప్రారంభించింది. నేటి నుంచి (ఏప్రిల్ 18) ఈ ఈ - ఆటో సేవలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. 


ఈ ఈ-ఆటోల్లో ప్రయాణించాలనుకొనే ప్రయాణికులు ముందుగానే మెట్రో రైడ్‌ (Metro Raid) అనే యాప్‌ ద్వారా ఆటోలను బుక్‌ చేసుకోవాలి. వీరు బెంగళూరులో గతేడాది ప్రారంభించినప్పుడు మొదటి కిలో మీటరుకు రూ.10 చొప్పున వసూలు చేసేవారు. ఆ తర్వాతి కిలో మీటరుకు రూ.5 చొప్పున చార్జి చేశారు. అయితే, హైదరాబాద్‌లో ఛార్జీలు ఎలా ఉంటాయనేది మాత్రం ఆటోల ప్రారంభం సందర్భంగా వెల్లడించే అవకాశం ఉంది. 


కాలనీల్లోని మెట్రో రైడ్‌ పార్కింగ్‌ ప్లేస్ దగ్గరికి వెళితే చాలు.. ఈ - ఆటో మిమ్మల్ని మెట్రో స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇలా ఇళ్లు, ఆఫీసులు అనే కాదు స్కూళ్లు, కాలేజీలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాలకు సులువుగా వెళ్లి వచ్చేందుకు వీలు ఉంటుంది. మెట్రో రైడ్‌ ఆటో డ్రైవర్లలో 20 శాతం మంది మహిళలు ఉండటం గమనార్హం. వీరిని మహిళా ప్రయాణికుల కోసం వినియోగిస్తారు. వెయింటింగ్ టైంని నివారించడం కోసం తొలుత రోజూ ఒకే సమయంలో ప్రయాణించే ఆఫీసులకు వెళ్లేవారు, విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 


ఈ మెట్రో రైడ్ కంపెనీని 2021లో ప్రారంభించారు. ఈ మధ్య కాలంలో దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించారు. ప్రస్తుతానికి ఢిల్లీ, హైదరాబాద్ కలిపి మొత్తం 150 మంది డ్రైవర్లు ఉన్నారు. తమ ఈ-ఆటోల ద్వారా తాము తిరుగుతున్న ప్రతి కిలో మీటరుకు 120 గ్రాముల కర్బన ఉద్గారాలను తగ్గిస్తున్నామని సంస్థ సీఈవో, సహ వ్యవస్థాపకుడు గిరిష్ నాగ్ పాల్ వెల్లడించారు. ప్రతి రైడ్‌లో సరాసరిన 600 గ్రాముల ఉద్గారాలు తగ్గిస్తున్నట్లు గతంలో ఓ సందర్భంలో చెప్పారు.