ప్రేమ ఎంత త్వరగా పుడుతుందో తెలియదు గానీ, విడిపోతే అది కొన్ని సందర్భాలలో ప్రాణాలు తీసే వరకు వ్యవహారం వెళ్తోంది. తమ దారులు వేరు అనుకుంటే బ్రేకప్ చెప్పి విడిపోవచ్చు. కానీ అవతలి వారిపై దాడులు చేయడం, హింసించడం చేయడం చేయకూడదు. తాజాగా అలాంటి ఘటనే బెంగళూరులో జరిగింది. హైదరాబాద్ కు చెందిన యువతి కర్ణాటక రాజధాని బెంగళూరులో మృతిచెందింది. అయితే ప్రియుడే ఆమెను హత్య చేసి ఉంటాడని స్నేహితులు ఆరోపిస్తున్నారు. యువతి మరణం పలు అనుమానాలకు దారితీసింది. మరోవైపు యువతి చనిపోయినట్లు గుర్తించిన అనంతరం ఆమె ప్రియుడి జాడ కనిపించడం లేదు. అతడు పరారీలో ఉండటంతో అతడే ఆమెను హత్య చేసి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు.


అసలేం జరిగిందంటే.. 
హైదరాబాద్​కు చెందిన ఆకాంక్ష విద్యాసాగర్ (23) జాబ్ కోసం బెంగళూరు వెళ్లింది. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో ఆమె జాబ్ చేస్తోంది. ఆమె వర్క్ చేసే కంపెనీలో పనిచేస్తున్న అర్పిత్ గుజ్రాల్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వీరు కొంతకాలం నుంచి గాఢంగా ప్రేమించుకుంటున్నారు. అర్పిత్ గుజ్రాల్ ఢిల్లీకి చెందినవాడు. ఈ ఇద్దరు గత కొంతకాలం నుంచి జీవన్ బీమా నగర్ పరిధిలోని కోడిహళ్లిలోని ఓ ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు. ఏం జరిగిందో తెలియదుగానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అప్పుడప్పుడు గొడవ పడేవారని స్నేహితులు చెబుతున్నారు. తమకు సెట్ అవ్వదని, విడిపోవడమే బెటర్ అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 


విడిపోవాలని డిసైడైన ఈ ప్రేమ జంట సోమవారం మరోసారి గొడవ పడింది. గొడవ పెరిగి పెద్దది కావడం, పైగా లవ్ ఫెయిల్ అవుతుందన్న ఆవేశంలో ఉన్న అర్పిత్ ప్రియురాలు ఆకాంక్షపై దాడి చేశాడు. ఆపై గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉంటాడని వారు భావిస్తున్నారు. ఒక ఫ్రెండ్ రూమ్ కు వెళ్లి చూడగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. చనిపోయిన ఆకాంక్ష మెడకు తాడు కట్టి ఫ్యాన్ కు వేలాడదీసి, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అంతా భావించి ఆ యువకుడు ప్లాన్ చేశాడని చెబుతున్నారు. ఆకాంక్ష చనిపోయినట్లు గుర్తించిన తరువాత నుంచి ఆమె ప్రేమించిన అర్పిత్ కనిపించకుండా పోవడంతో అతడిపైనే ఆమె స్నేహితులకు అనుమానం కలుగుతోంది. పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి వచ్చి ఆకాంక్ష డెడ్ బాడీని కిందకి దించి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.