హైదరాబాద్ లోని కుల్సుంపురాలో దారుణం జరిగింది. ఓ మహిళ నిద్రిస్తున్న తన భర్తపై వేడి వేడి నూనె పోసి ఆపై నిప్పంటించింది. మంగళవవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే విజయవాడకు చెందిన గిరిధర్ లాల్ (45), రేణుక దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఉపాధి నిమిత్తం మూడేళ్ల క్రితం వీరు హైదరాబాద్ వచ్చారు. కొన్నాళ్ల పాటు హాయిగా సాగిన వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. భర్త గిరిధర్ లాల్ మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని అనుమానం పెంచుకున్న రేణుక.. తరచుగా అతడితో వాగ్వాదానికి దిగేది. ఇద్దరూ కొట్టుకునే వారు కూడా. అయితే తాజాగా మంగళ వారం కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. 


వాగ్వాదం సద్దుమణిగాకా.. భర్త గిరిధర్ లాల్ పడుకున్నాడు. రేణుక మాత్రం అతడిపై పీకల దాకా కోపాన్ని పెంచుకోంది. ఈ క్రమంలోనే నూనెను వేడి చేసి మరీ పడుకున్న భర్తపై పోసింది. ఆపై నిప్పంటించింది. గిరిధర్ లాల్ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అతడి శరీరం 45 శాతానికి పైగా కాలిపోయింది. దీంతో అంబులెన్స్ ద్వారా అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆపై పోలీసులుకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడు గిరిధర్ వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. ఈ క్రమంలోనే భార్యే కావాలని తనకు నిప్పు పెట్టిందని. హత్యాయత్నానికి ప్రయత్నించిందని తెలుసుకున్నారు. వెంటనే వెళ్లి అతడి భార్య రేణుకను అరెస్ట్ చేశారు. కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


క్షణికావేశంలో కట్టుకున్న వాడిని కడతేర్చిన భార్య..


తాజాగా కామారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో భర్తను హత్య చేయించిందో భార్య.. రుద్రూర్ లో  జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రుద్రూర్ గ్రామానికి చెందిన కుమ్మరి పోశెట్టి వయస్సు 40 కి ధర్మాబాద్ బాలాపూర్ కు చెందిన సావిత్రితో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. దంపతులు ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ జీవించే వారు. ఈ క్రమంలో గృహ నిర్మాణ పనులు చేసే జెఎస్సీ కాలనీకి చెందిన బట్టు శ్రీనివాస్ తో సావిత్రికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది.


ఈ విషయం ఇటీవల సావిత్రి భర్త పోశెట్టికి తెలియడంతో భార్యతో ఘర్షణ పడ్డాడు. చెడు అలవాట్లు మానుకోవాలని సావిత్రికి చెప్పాడు. సావిత్రి బుద్ధి మార్చుకోనందున తరుచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో సావిత్రి తల్లి చంద్రభాగ ఇటీవల రుద్రూర్ వచ్చింది. కూతురుతో తరుచూ గొడవ పడుతున్న పోశెట్టిని తప్పించాలని తల్లి కూతుళ్లు శ్రీనివాస్ ను ప్రేరేపించారు. దీంతో ఈ నెల 2న పోశెట్టిని ఇంటి నుంచి శ్రీనివాస్ బైక్ పై  తీసుకుని వెళ్లాడు. కల్లు దుకాణంలో కల్లు తాగించాడు.


అనంతరం మద్యం షాపులో మందు తీసుకొని నక్కల ఒర్రెకు వెళ్లారు. అక్కడ పోశెట్టికి పూటుగా మద్యం తాగించి చెరువు బ్యాక్ వాటర్ ఒర్రెలోకి తోసేశాడు. చనిపోయాడని నిర్ధారించుకుని ఇంటికి వెళ్లి సావిత్రికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. అనంతరం సావిత్రి ఏమి తెలియనట్లు నటించింది. రెండు రోజులుగా పోశెట్టి కనిపించడం లేదని ఇరుగు పొరుగు వారు ప్రశ్నిస్తే సమాధానం దాటవేసింది. చివరకు పోలీస్ స్టేషన్ లో తన భర్త కన్పించడం లేదని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్సై రవీందర్ దర్యాప్తు చేయగా శ్రీనివాస్ సావిత్రికి ఉన్న సంబంధం బయటపడింది. శ్రీనివాస్ ను విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఘటన స్థలికి  రుద్రూర్ సీఐ జాన్ రెడ్డి, ఎస్సై రవీందర్ వెళ్లి మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికి తీయించారు. మృతుడి భార్య సావిత్రి, అత్త చంద్రబాగ, శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు.