Rajendranagar Police Station: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో కీచక కానిస్టేబుల్ బాగోతం బయటికి వచ్చింది. మైనర్ బాలికలను టార్గెట్ చేసి శారీరక సుఖం పొందుతున్న ఖాకీ గుట్టు ఆలస్యంగా పోలీసులు గుర్తించారు. మైనర్ అమ్మాయిలను బెదిరించి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. వారిని వాడుకుంటున్నట్లుగా బాధితులు వాపోయారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి అమ్మాయిల ఫోన్లకు పంపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా గుర్తించారు.


తనతో పడుకోకపొతే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ కానిస్టేబుల్ పలువురిని బెదిరిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మైనర్ బాలికతో గత రెండు సంవత్సరాల నుండి ఎఫైర్ ఉందని.. అయితే, ఆమె గర్బం దాల్చకుండా కీచకుడు పసరు పోసినట్లుగా గుర్తించారు. పైగా బాలిక నగ్న వీడియోలు తీసి బాలిక ఫోన్ కు కానిస్టేబుల్ పంపాడు. తాను పిలిచినపుడు తనతో గడపాలని బెదిరించడమే కాకుండా.. తన నీ విడియోలు బయట పెడతానంటూ వేధించాడు.


చేసేది ఏమి‌ లేక ఆ బాలిక ఆ కానిస్టేబుల్‌కు లొంగిపోయింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా నిందితుడు ప్రదీప్ పని చేస్తున్నాడు. 2020 బ్యాచ్ కు చెందిన ప్రదీప్.. రాజేంద్రనగర్, కొంపల్లి, కూకట్ పల్లిలో పని చేశాడు. అతను పని చేసిన ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇదే వ్యవహారం నడిపాడు. ప్రదీప్ వ్యవహారం బయటకు పొక్కడంతో పై అధికారులు సీరియస్ అయ్యారు. నిన్న సైబరాబాద్ కమిషనర్ ను బాధితురాలి కుటుంబ సభ్యులు కలిసి ఈ విషయం చెప్పడంతో విషయం బయటికి వచ్చింది. 


తమను కూడా కానిస్టేబుల్ ప్రదీప్ బెదిరించినట్లుగా బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. షీ టీమ్ సహాయంతో రాజేంద్రనగర్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.