Telangana Formation Day: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ మేరకు జూన్‌ 2న జరిగే దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉత్సావాల సందర్భంగా  చేపట్టాల్సిన చర్యల గురించి ప్రభుత్వ యంత్రాంగానికి పలు కీలక సూచనలు చేశారు. రెండో తేదీ ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం కార్యక్రమాల వివరాలను వెల్లడించింది. 


అమరవీరులకు నివాళులతో కార్యక్రమాలు ప్రారంభం 
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్‌ 2న ఉదయం 9.30కు అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్, మంత్రులు నివాళులు అర్పించనున్నారు. ఉదయం 10 గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్‌ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ను ఆవిష్కరణ ఉంటుంది. తరువాత సోనియా గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలు అందించిన పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డుల ప్రదానం కార్యక్రమం జరుగుతుంది. అవార్డు స్వీకర్తలతో ఫొటో సెషన్‌ అనంతరం ఉదయం కార్యక్రమం ముగుస్తుంది.


ట్యాంక్‌బండ్‌ వేదికగా సంబరాలు 
ట్యాంక్‌బండ్‌ మీద జూన్ 2 సాయంత్రం సంబరాలు నిర్వహిస్తారు. తెలంగాణకు చెందిన హస్త కళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్‌ స్టాల్స్‌‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 6.30కు సీఎం రేవంత్‌ ట్యాంక్‌బండ్‌కు చేరుకుని స్టాళ్లను సందర్శిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ గొప్పదనం చాటేలా, తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టేలా కార్నివాల్‌ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 700 మంది కళాకారులు పాల్గొంటారు. ట్యాంక్‌ బండ్‌ వద్ద ఉత్సవాల కోసం ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు జరగనున్నాయి.


5 వేల మందితో ఫ్లాగ్ వాక్
ఉత్సవాల్లో భాగంగా ఐదు వేల మందితో ట్యాంక్ బండ్ వద్ద ఫ్లా్గ్ వాక్ నిర్వహించనున్నారు. జాతీయ జెండాలతో ట్యాంక్‌బండ్‌ ఒక చివర నుంచి మరో చివరి వరకు 5 వేల మంది ఫ్లాగ్‌వాక్‌ నిర్వహిస్తారు. ఈ ఫ్లాగ్‌ వాక్‌ జరుగుతున్న సమయంలో 13.30 నిమిషాల నిడివి ఉన్న ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గేయం పూర్తి వెర్షన్‌‌ను విడుదల చేస్తారు. అనంతరం గీత రచయిత, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిలను ప్రభుత్వం సన్మానించనుంది. రాత్రి 8.50 గంటలకు రంగులు విరజిమ్మేలా సాగే బాణసంచా కార్యక్రమంతో జరగనుంది. అక్కడితో తెలంగాణ దశాబ్ధి వేడుకలు ముగుస్తాయి.


ముమ్మరంగా ఏర్పాట్లు 
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రధాన వేదికతోపాటు, ముఖ్య అతిథులు, ఆహ్వానితులు, ప్రజాప్రతినిధులకు లాంజ్‌లను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో భారీ టెంట్లు, తాగునీరు, పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణసంచా, లేజర్‌ షో, ఫుడ్, గేమింగ్‌ స్టాళ్ల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దాదాపు 80 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్టాళ్లలో హస్తకళలు, మహిళా బృందాలు తయారు చేసిన ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, ప్రముఖ హోటళ్ల స్టాల్స్, చిన్న పిల్లలకు గేమింగ్‌ షోలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళాబృందాలు కార్నివాల్‌లో ప్రదర్శన ఇవ్వనున్నాయి.